KTR: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలకు క్షేత్రస్థాయిలోని నీళ్లే సరైన సమాధానం చెబుతున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు (కేటీఆర్) పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరొకసారి చాటిచెబుతోందని ఆయన సోమవారం సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా వ్యాఖ్యానించారు.
“రెండు లక్షల ఎకరాలకు భరోసా!”
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా శ్రీరాంసాగర్ (SRSP) వరద కాలువను ‘రివర్స్ పంపింగ్’ పద్ధతిలో పునరుజ్జీవింపజేస్తున్న దృశ్యాలను కేటీఆర్ పంచుకున్నారు. వరద కాలువ పరిధిలోని రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్హౌస్ల నుండి నీటిని నిరంతరాయంగా ఎత్తిపోస్తున్నట్లు తెలిపారు. ఈ ఎత్తిపోతల ద్వారా సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతోందని, ఇది తెలంగాణ రైతన్నల పంటలకు కొండంత భరోసానిస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
“రైతులకు నిజా నిజాలు తెలుసు”
కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్ని అబద్ధాలు, దుష్ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కేటీఆర్ అన్నారు. పచ్చని తమ పొలాల్లో నేరుగా ప్రవహిస్తున్న కాళేశ్వరం జలాలను కళ్లారా చూస్తున్న తెలంగాణ రైతాంగానికి ఏది నిజమో, ఏది అబద్ధమో స్పష్టంగా తెలుసని ఆయన స్పష్టం చేశారు.
