Kishan reddy: చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, కమ్యూనిస్టులు నిర్వహించిన సమావేశాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి మరియు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. “ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఈ సమావేశం ఉందంటూ” వ్యంగ్యంగా విమర్శించారు.
అవసరమైతేనే పునర్విభజన ప్రక్రియ
ఇప్పటి వరకు నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన విధి విధానాలు ఖరారు కాలేదని, నిబంధనలు రూపొందించనే లేదని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టించడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కిషన్ రెడ్డి ఆరోపించారు.
ప్రతిపక్షాల అసలు ఉద్దేశం బీజేపీపై దుష్ప్రచారం
ప్రతిపక్షాల అసలు ఎజెండా ప్రజల సమస్యలపై కాకుండా, బీజేపీపై విషం కక్కడమేనని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో, కర్నాటకలో కాంగ్రెస్ గ్యారెంటీల హామీలను అమలు చేయడంలో విఫలమైందని, తమిళనాడులో డీఎంకే అవినీతి కుటుంబ పాలనతో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందని విమర్శించారు.
అసలు పునర్విభజన ప్రక్రియపై కేంద్రం ఇంకా నిర్ణయాలు తీసుకోకముందే ప్రతిపక్షాలు అపోహలు సృష్టించడం ఆందోళనకరమని, ప్రజలను తప్పుదోవ పట్టించడాన్ని బీజేపీ అంగీకరించబోదని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు.