MLC Kavitha: తెలంగాణ జాగృతి వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన ఆమె, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంలో తెలంగాణ ఉద్యమం, బీసీ హక్కుల కోసం జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు.
కవిత పేర్కొన్నదేమిటంటే..
‘‘సామాజిక తెలంగాణ’’ అంటే ఢిల్లీకి వెళ్లి వట్టిగా ధర్నాలు చేయడం కాదు, నిజమైన మార్పు కోసం రాష్ట్రంలోనే గళం వినిపించాలి అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరగాలన్నదే ప్రొఫెసర్ జయశంకర్ కల అని గుర్తు చేశారు.
బీసీల కోసం ఔదార్యంతో పనిచేయాలి
బీసీ రిజర్వేషన్ల విషయమై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చేస్తున్న ధర్నాలపై కవిత తీవ్రంగా స్పందించారు. ‘‘దొంగ దీక్షలతో కాదు… నిజమైన దీక్షలతో బీసీలకు న్యాయం జరగాలి’’ అని సూచించారు. తెలంగాణ జాగృతి తరపున తాను హైదరాబాద్లో 72 గంటల నిరాహార దీక్షకు సిద్ధమయ్యానని, కానీ కోర్టు అనుమతి రాకపోవడంతో ఆగిపోవాల్సి వచ్చిందని వివరించారు.
ఇది కూడా చదవండి: Kaleswaram Plan: కేసీఆర్ రాజకీయ చాణక్యుడే.. కానీ ఇక్కడున్నది రేవంత్!
‘‘బీసీల కోసం మేము ఆగం. ఈ పోరాటం కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ బీసీల పట్ల చిత్తశుద్ధితో పనిచేయడంలేదు’’ అని మండిపడ్డారు. జాగృతిలోకి చేరడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారని, అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తోందని చెప్పారు.
అఖిలపక్షంగా ఢిల్లీకి వెళ్ళండి: జాగృతి డిమాండ్
బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అఖిలపక్ష నాయకులతో వెళ్లాలని కవిత డిమాండ్ చేశారు. ‘‘ప్రతి పార్టీ నాయకులకు లేఖలు రాసి, రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకొని బీసీల సమస్యపై చర్చించాలి’’ అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీల నాయకులను కలిపి జై తెలంగాణ అనేలా చేసినట్టు గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఏకతాటిపైకి వచ్చి, బీసీల హక్కుల కోసం అన్ని పార్టీలు కలసి పోరాడాలని ఆమె కోరారు.
