S. Jaishankar: భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ధం ఆపాడానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఖండించారు. ట్రేడ్ డీల్కు, కాల్పుల విరమణకు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.
న్యూయార్క్లో ఉన్న ‘న్యూస్వీక్’ అనే అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ ఈ విషయాలను స్పష్టం చేశారు.
ఏం జరిగింది?
జైశంకర్ వివరించిన ప్రకారం.. 2024 మే 9న జరిగిన ఓ ప్రత్యేక సంఘటనను గుర్తు చేశారు. అదే రోజు రాత్రి, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధానమంత్రి మోదీకి ఫోన్ చేసి, పాకిస్థాన్ పెద్ద ఎత్తున దాడికి సిద్ధమవుతుందని హెచ్చరించారు. ఆ సమయంలో జైశంకర్ ప్రధాని పక్కనే ఉన్నారు.
మోదీ స్పందిస్తూ, పాక్ దాడికి సమర్థవంతంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు. అదే రాత్రి పాక్ దాడికి పాల్పడింది. భారత బలగాలు వెంటనే దీటుగా బదులిచ్చాయి.
ఇది కూడా చదవండి: Judgement: ఐ లవ్ యూ చెప్పడం లైంగిక వేధింపు కాదు: హైకోర్టు సంచలన తీర్పు
కాల్పుల విరమణ ఎలా జరిగింది?
తర్వాతి ఉదయం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో జైశంకర్కు ఫోన్ చేసి, పాక్ చర్చలకు సిద్ధంగా ఉందని చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం పాక్ మిలటరీ ఆపరేషన్స్ డీజీ ఖసిఫ్ అబ్దుల్లా, భారత డీజీ రాజీవ్ ఘాయ్కు కాల్ చేసి కాల్పుల విరమణ కోరారు. ఈ నేపథ్యంలోనే కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.
జైశంకర్ తేల్చిచెప్పిన విషయమేమిటంటే.. ట్రంప్ చెబుతున్నట్టుగా వారు యుద్ధాన్ని ఆపలేదని, వాణిజ్య ఒప్పందాలు ఈ పరిణామాలకు అసలు కారణాలు కావని అన్నారు.
పహల్గామ్ దాడి ఒక ఆర్థిక యుద్ధ చర్య
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని జైశంకర్ “ఆర్థిక యుద్ధం”గా అభివర్ణించారు. కశ్మీర్లో పెరుగుతున్న శాంతిని, పర్యాటకాన్ని ఓర్వలేకే ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు. పర్యాటకుల మతం అడిగి వారిపై కాల్పులు జరిపారని, మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని తెలిపారు.
భారత్ తగిన విధంగా ప్రతిస్పందిస్తుందని, ఉగ్రవాదాన్ని సహించే ప్రభుత్వాలనూ ప్రశ్నిస్తామని హెచ్చరించారు. అణ్వస్త్రాల బెదిరింపులకు భారతదేశం తలవంచే దేశం కాదని స్పష్టం చేశారు.
