Viral News

Viral News: ఓపిక లేకపోతే వెళ్ళిపో.. గాంధీ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం..!

Viral News: పేదవాడికి ప్రాణదానం చేయాల్సిన ప్రభుత్వ పెద్దాసుపత్రిలో మానవత్వం మంటగలిసింది. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా నిరుపేదలు ఎంతో నమ్మకంతో వచ్చే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యపు ధోరణి మరోసారి బయటపడింది. గంటల తరబడి బారులు తీరి ఎదురుచూస్తున్న రోగుల పట్ల కొందరు సిబ్బంది వ్యవహరించిన తీరు తీవ్ర ఆగ్రహానికి, ఆవేదనకు గురిచేసింది. రోజంతా ఆకలి దప్పులను ఓర్చుకుంటూ, నొప్పులతో విలవిల్లాడుతున్న బాధితులకు వైద్యం అందించాల్సింది పోయి, దురుసు సమాధానాలతో అవమానించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మాకు ఓపిక లేదు.. మీరే వెళ్లిపొండి

పరీక్షలు, డాక్టర్ల కన్సల్టేషన్ కోసం చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలతో కూడిన రోగులు ఉదయం నుంచే దాదాపు 4 గంటలకు పైగా క్యూలైన్లలో పడిగాపులు కాశారు.సమయం గడుస్తున్నా వైద్యం అందకపోవడంతో తమ పరిస్థితిని వివరించేందుకు వెళ్లిన బాధితులకు అక్కడి సిబ్బంది నుంచి తీవ్ర అవమానం ఎదురైంది. “మాకు ఓపిక లేదు.. మీరే ఇక్కడి నుంచి వెళ్లిపొండి” అంటూ మొహం మీదే విసుక్కుంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలని, ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు పెట్టుకోలేకనే ఇక్కడికి వస్తున్నామని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఓపిక లేకపోతే ఎందుకు పనిచేస్తున్నారు?
ప్రజల సమస్యలను విని వైద్యం అందించాల్సిన బాధ్యత ఉన్నప్పుడు, ఓపిక లేదని సమాధానం చెప్పడమేంటని బాధితులు తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉంటూ ఇలాంటి సమాధానాలు చెప్పేవారు ఆసుపత్రిలో ఎందుకు పనిచేస్తున్నారని మండిపడ్డారు.
నిరంతర నిర్లక్ష్యం..

గాంధీ ఆసుపత్రిలో ఓపీ కౌంటర్లు, రక్త పరీక్షల కేంద్రాలు, ఎమర్జెన్సీ విభాగాల్లో సాధారణ రోగుల పట్ల కొందరు సిబ్బంది, నర్సులు, జూనియర్ డాక్టర్లు నిత్యం ఇలాగే అమర్యాదగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపించారు.రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించిన సదరు సిబ్బందిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, పేదలకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందేలా ఉన్నతాధికారులు, ప్రభుత్వం పర్యవేక్షణ పెంచాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *