Gautam Gambhir: శ్రీలంకతో వన్డే సిరీస్ లో పరాజయం.. సొంతగడ్డపై కివీస్ జట్టు చేతిలో వైట్ వాష్ ..గంభీర్ కోచ్ అయిన మూడు నెలల్లో టీమిండియాకు స్ర్టోకు మీద స్ట్రోకు .. షాక్ల మీద షాక్లు తగలడంతో జట్టు లోని సీనియర్ ప్లేయర్లు.. కోచ్ గంభీర్ ఫ్యూచర్ పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
Gautam Gambhir: టీమిండియా కోచ్ పదవి అంటే అదేదో స్కూలు మాస్టర్ బెత్తం పట్టుకున్నట్లుగా చేస్తానంటే కుదరదు.. మన ప్లేయర్లతో కలివిడిగా ఉండాలి. క్రికెట్ విషయాల్లో వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి. అబ్బో చాలా ఉంటుంది. గతంలో రవిశాస్ర్తి కోచ్ గా పని చేసిన సమయంలో జట్టులో జాలీగా ఉండే వాతావరణం కనిపించేది. కోహ్లీ లాంటి అగ్రెసివ్ ప్లేయర్ కెప్టెన్ గా ఉన్న సమయంలో జట్టును నల్లేరుపై నడకలాగా రవిశాస్త్రి నడిపించాడు. అతని అనంతరం రాహుల్ ద్రవిడ్ కూడా అద్భుతంగా టీమిండియాను నడిపించాడు. ప్లేయర్లతో కలిసిపోతూనే పెద్దన్నలాగా రాహుల్ ద్రవిడ్ జట్టులో ఐకమత్యాన్ని తీసుకువచ్చాడు. సీనియర్లు, జూనియర్లు ఇద్దరికీ సమ ప్రాధాన్యం ఇచ్చేలా పెద్దమనిషి తరహాలో వ్యవహరిస్తూ జట్టును విజయవంతంగా నడిపించాడు. ఇందుకు భిన్నంగా గౌతం గంభీర్ కెరీర్ సాగుతోంది. గతంలో కోచ్ కుంబ్లే లాగా గంభీర్ కూడా వ్యవహరించడంతో జట్టుకు పరాజయాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. మరీ హెడ్ మాస్టర్ లాగా ..ప్లేయర్లను స్కూల్ పిల్లల్లాగా ట్రీట్ చేస్తే టీమిండియాలో కుదరదు. అందుకే అద్భుతమైన క్రికెటింగ్ బుర్ర ఉన్నా అనిల్ కుంబ్లే కోచ్ గా అవమానకర రీతిలో తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు గంభీర్ పరిస్థితి కూడా అంతే ఉండేలా కనిపిస్తోంది.
Gautam Gambhir: రెండుసార్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత.. వన్డే ప్రపంచకప్లో రన్నరప్.. టీ20 ప్రపంచకప్లో విజయం.. ఇలా ప్రపంచ క్రికెట్లో టీమ్ఇండియా ప్రస్థానం గొప్పగానే సాగింది. ఐపీఎల్ లో కోల్కతా నైట్రైడర్స్ను గొప్పగా నడిపించి ఆ జట్టుకు టైటిల్ అందించిన గౌతమ్ గంభీర్..చీఫ్ కోచ్ పదవిని అందుకోవడంతో టీమిండియా ఆట ఇంకో స్థాయికి వెళ్తుందని, మరెన్నో విజయాలు సాధిస్తుందని భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ అవన్నీ అడియాసలయ్యాయి. గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక టీమ్ఇండియా.. శ్రీలంక పర్యటనకు వెళ్లి టీ20, వన్డే సిరీస్లు ఆడింది. ఆపై సొంతగడ్డలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్లతో టెస్టు సిరీస్ల్లో తలపడింది. కొన్నేళ్లుగా భారత జట్టు ప్రదర్శన, ప్రత్యర్థి జట్ల ఆటతీరును బట్టి చూస్తే ఈ సిరీస్లు అన్నింటినీ సునాయాసంగా గెలిచేసి ఉండాలి. కోచ్గా గంభీర్కు మంచి ఆరంభం దక్కుతుందని బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి జట్టు ఉత్సాహంగా బయలుదేరడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఈ మూడు నెలల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. శ్రీలంకపై 27 ఏళ్ల తర్వాత భారత జట్టు వన్డే సిరీస్ ఓడిపోయింది. శ్రీలంకలో వైట్వాష్కు గురైన కివీస్.. భారత్ను సొంతగడ్డపై ఇలా చిత్తు చేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ పరాజయాలతో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మాత్రమే కాక కోచ్ గౌతమ్ గంభీర్ కూడా తీవ్ర ఒత్తిడిలో పడ్డారు. బంగ్లాదేశ్తో సిరీస్లో పేస్ పిచ్లతో ప్రయోగాలు చేయడం, తుది జట్టు ఎంపికలో చూపిన ప్రత్యేకత, టీమిండియా ఆటతీరులో దూకుడు పెరగడం చూసి గంభీర్ కోచ్గా బలమైన ముద్రే వేయబోతున్నట్లు కనిపించింది. కానీ న్యూజిలాండ్ సిరీస్ తర్వాత కథ మొత్తం మారిపోయింది.
Gautam Gambhir: గంభీర్ కోచ్ కావడానికి ముందు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పట్టికలో భారత్ తిరుగులేని స్థితిలో ఉంది. అగ్రస్థానంతో అలవోకగా ఫైనల్కు అర్హత సాధించేలా కనిపించింది. గత రెండు పర్యాయాలు చేజారిన టైటిల్ను ఈసారి సాధిస్తుందనే ఆశతో అభిమానులు ఉన్నారు. కానీ ఇప్పుడు టైటిల్ సంగతి పక్కన పెడితే భారత్ ఫైనల్ చేరడమే కష్టంగా మారిపోయింది. కివీస్తో సిరీస్లో ఆటతీరు చూశాక ఆస్ట్రేలియాలో రోహిత్సేన అద్భుతాలు చేస్తుందనే ఆశలు పెద్దగా లేవు. వరుసగా రెండుసార్లు అక్కడ సిరీస్లు సాధించి చరిత్ర సృష్టించిన టీమిండియాకు ఈసారి పరాభవం తప్పదనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. . అంతేకాదు జట్టు ఎంపిక దగ్గర్నుంచి పిచ్ల వరకు ప్రతి విషయంలోనూ గంభీర్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అంతేకాదు పిచ్ లపై కోచ్ గంబీర్ చేసిన పిచ్చి ప్రయోగాలకు బిసిసిఐ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో గంభీర్ కోచ్గా జట్టును ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరం. ఈ సిరీస్లో ఓటమి ఎదురైతే మాత్రం అతడికి తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ఓటములకు బాధ్యత వహించి ఆరంభ దశలోనే కోచ్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు.