Crime News: దేశ రాజధాని ఢిల్లీలోని నార్త్ డిస్ట్రిక్ట్ పరిధి లాహోరీ గేట్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ‘ప్రిన్స్ హోటల్’ గదిలో 25 ఏళ్ల యువతి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. ప్రియుడే ఆమెను కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం నిందితుడు కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అతడిని విషమ పరిస్థితిలో ఆసుపత్రికి తరలించారు.
హోటల్ గదిలో ఏం జరిగింది?:
పోలీసులు ఘటనా స్థలాన్ని ఆధీనంలోకి తీసుకుని, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నిందితుడు ప్రస్తుతం మాట్లాడే స్థితిలో లేడని, వైద్యుల చికిత్స అనంతరం అతడు కోలుకుని స్పృహలోకి వస్తేనే హత్యకు దారితీసిన అసలు వివాదం ఏమిటనేది స్పష్టమవుతుందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
