PM Modi

PM Modi: ఇకపై చర్చలకే పరిమితం కాదు.. UNSC సంస్కరణలు వెంటనే చేపట్టాలి!

PM Modi: భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో ప్రారంభమైన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం అంతర్జాతీయ వేదికపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు, గ్లోబల్ సౌత్ దేశాలకు నిర్ణయాధికారాల్లో భాగస్వామ్యం, గ్లోబల్ ఆర్థిక పాలనలో మార్పులపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న బ్రిక్స్.. ఇప్పుడు మానవ జీవితంలో 20 ఏళ్ల యువకుడిలా పరిపక్వత, బాధ్యతలు పెరిగే దశకు చేరుకుందని ప్రధాని మోదీ అభివర్ణించారు. రాబోయే 20 ఏళ్ల కోసం బ్రిక్స్ సరికొత్త, ప్రతిష్టాత్మక లక్ష్యాలతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ప్రపంచ పాలనా సంస్కరణలకు 3 కీలక సూత్రాలు..

ప్రపంచ పాలనలో సంస్కరణల కోసం ఒక సమగ్ర రోడ్‌మ్యాప్‌ను ప్రధాని మోదీ ప్రతిపాదించారు. ఇది ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉండాలని స్పష్టం చేశారు:
  1. ప్రాతినిధ్యం (Representation): అన్ని దేశాల వాణికి సమాన గౌరవం దక్కాలి.
  2. జవాబుదారీతనం/స్పందన (Responsiveness): సమస్యలు వచ్చినప్పుడు అంతర్జాతీయ సంస్థలు వెంటనే స్పందించేలా ఉండాలి.
  3. నియమాల రూపకల్పన (Rule-making): కేవలం కొద్దిమంది పెత్తనం కాకుండా, అందరి ఆమోదంతో పారదర్శక నిబంధనలు రూపొందించాలి.

ఐరాస భద్రతా మండలి (UNSC) సంస్కరణలు ఇక ఆలస్యం వద్దు..

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ పోవడం సరికాదన్నారు. ఇకపై ఈ అంశంపై చర్చలు ప్రకటనలకే పరిమితం కాకూడదని, నిర్దిష్ట గడువుతో కూడిన స్పష్టమైన ఫలితాలను సాధించాలని పిలుపునిచ్చారు. ప్రపంచం ఎంతగానో మారిపోయిందని, కానీ ఐక్యరాజ్యసమితిలోని ప్రాతినిధ్య వ్యవస్థ మాత్రం దశాబ్దాల క్రితం నాటి పాత విధానాల్లోనే ఉండిపోయిందని.. ప్రస్తుత వాస్తవాలకు అనుగుణంగా మార్పులు తక్షణావసరమని పేర్కొన్నారు.

అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో ఓటింగ్ హక్కులు మారాలి..
ప్రపంచ ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ వంటి ఆర్థిక సంస్థల్లో తగిన నాయకత్వ స్థానాలు, ఓటింగ్ హక్కులు దక్కాలని ప్రధాని డిమాండ్ చేశారు. ప్రపంచ సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్న దేశాలే గ్లోబల్ ఎకనామిక్ పాలసీల రూపకల్పనలో కూడా కీలక నిర్ణేతలుగా ఉండాలని స్పష్టం చేశారు.
‘గ్లోబల్ సౌత్’ – విశేషాధికారాల పిరమిడ్ మారాలి..
వాతావరణ మార్పులు, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాల వల్ల తీవ్రంగా నష్టపోయేది గ్లోబల్ సౌత్ దేశాలే అయినప్పటికీ.. నిర్ణయాలు తీసుకునే వేదికల్లో మాత్రం వాటికి స్థానం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యవస్థలో ఉన్న ‘విశేషాధికారాల పిరమిడ్’ను రద్దు చేసి, ప్రతి దేశం గొంతు వినిపించే ‘సమాన భాగస్వామ్య వేదిక’గా మార్చాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
‘కొనసాగింపు-అమలు యంత్రాంగం’ – భారత్ ప్రతిపాదన..

ప్రతి ఏడాది బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు వేరే దేశానికి మారినప్పటికీ, సంస్థాగత నిర్ణయాలు నిలిచిపోకుండా ఉండేందుకు “కొనసాగింపు మరియు అమలు యంత్రాంగం” (Continuity and Implementation Mechanism) ఏర్పాటు చేయాలని భారత్ ప్రతిపాదించింది. దీని ద్వారా బ్రిక్స్ తీసుకున్న నిర్ణయాలు, ప్రాజెక్టుల పురోగతిని ట్రోయికా పద్ధతిలో నిరంతరం పర్యవేక్షించవచ్చని సూచించారు. బ్రిక్స్ ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని, అందరినీ కలుపుకుని శాంతి, స్థిరత్వం, మానవతా దృక్పథంతో ముందుకు సాగాలన్నదే తమ ప్రధాన అజెండా అని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *