Hyderabad Metro Phase 2: హైదరాబాద్ నగర ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో జరిగిన ఒక ముఖ్యమైన సమావేశంలో, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పూర్తిగా పరిశీలించి, తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ (L&T) సంస్థ నుంచి తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో, రెండో దశను ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయన స్పష్టం చేయడం విశేషం.
హైదరాబాద్ నగర అభివృద్ధికి, ఇక్కడి ప్రజలకు మెరుగైన రవాణా వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని మంత్రి ఖట్టర్ భరోసా ఇచ్చారు. ఈ మెట్రో రెండో దశ నిర్మాణానికి అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించేలా ముందుకు వెళ్లడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది.
నగరంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 162 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ విస్తరణ కోసం ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. ఈ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందని, త్వరలోనే దీనిపై తదుపరి చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఈ రెండో దశ గనుక పూర్తయితే హైదరాబాద్లోని మరిన్ని ప్రాంతాలకు మెట్రో సౌకర్యం అందుబాటులోకి వచ్చి, ప్రయాణాలు మరింత సులువుగా మారుతాయి.
