Kharge and Rahul: దేశంలో చేపట్టబోయే జనాభా గణనలో కులాల వివరాల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రశ్నావళిపై కాంగ్రెస్ అగ్రనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న ‘ఓపెన్ ఎండెడ్’ (Open-ended) ప్రశ్నల విధానాన్ని వెంటనే రద్దు చేసి, సమగ్ర సంప్రదింపుల తర్వాత నూతన ప్రశ్నావళిని రూపొందించాలని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి సంయుక్తంగా లేఖ రాశారు.
సరైన డేటా లేకుండా సామాజిక న్యాయ పథకాలను పారదర్శకంగా అమలు చేయడం సాధ్యం కాదని, ప్రస్తుత విధానం వల్ల కులగణన లక్ష్యమే దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
‘ఓపెన్ ఎండెడ్’ విధానంతో వచ్చే నష్టాలు – ఖర్గే, రాహుల్ హెచ్చరిక..
ప్రస్తుత ప్రశ్నావళిలోని లోపాలను లేఖలో వివరిస్తూ..
-
వేలాదిగా విడిపోయే ప్రమాదం: ప్రస్తుత పద్ధతిలో ప్రజలు తమ కులం పేరును ఎలా చెబితే ఎన్యూమరేటర్లు అలా నమోదు చేస్తారు. భారతదేశంలో ఒకే కులానికి ప్రాంతం, మాండలికం, ఉపకులాలను బట్టి వేర్వేరు పేర్లు ఉంటాయి. ఒకే కులానికి చెందిన వారిని వేర్వేరు పేర్లతో రికార్డు చేస్తే, ఒక్కో కులం వేలాది ఎంట్రీలుగా విడిపోయి లెక్కలు గందరగోళంగా మారతాయి.
-
నిరుపయోగంగా మారే డేటా: ఇలా వేల సంఖ్యలో పేర్లు రావడం వల్ల సేకరించిన సమగ్ర కుల డేటా నిరుపయోగమవుతుందని స్పష్టం చేశారు.
-
వెనుకబడిన వర్గాలకు తీరని అన్యాయం: కులాల అసలు సంఖ్య తేలకపోతే వాటి సామాజిక, ఆర్థిక స్థితిగతులపై సరైన అంచనా వేయడం సాధ్యం కాదు. ఇది ఓబీసీలు, అత్యంత వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాల విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల రూపకల్పనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
-
‘బ్యాక్వర్డ్ క్లాస్’ ప్రస్తావన లేకపోవడం: ఈ ఫార్మాట్లో ‘బ్యాక్వర్డ్ క్లాస్’ అనే పదం లేకపోవడం వల్ల దేశంలో ఓబీసీల వాస్తవ జనాభా ఎంతనేది స్పష్టంగా తెలియకుండా పోతుందని తెలిపారు.
పరిష్కారం: ‘డ్రాప్డౌన్ జాబితా’ రూపొందించాలి..
ఈ సమస్యకు సులభమైన పరిష్కారాన్ని కాంగ్రెస్ నేతలు సూచించారు:
-
డ్రాప్డౌన్ పద్ధతి: ఎస్సీ (SC), ఎస్టీ (ST)ల గణనలో మాదిరిగానే ఇతర కులాలకు కూడా ముందుగానే ప్రామాణికమైన పేర్లతో ‘డ్రాప్డౌన్ జాబితా’ను రూపొందించాలని డిమాండ్ చేశారు.
-
అధికారిక రికార్డుల వినియోగం: సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల (SEBC) జాబితాలు, ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ఆధారంగా ఈ జాబితాను సులభంగా తయారు చేయవచ్చని సూచించారు.
-
తెలంగాణ, బీహార్ మోడల్: తెలంగాణ (2024), బీహార్ (2022)లలో విజయవంతంగా నిర్వహించిన కుల సర్వేలలో అనుసరించిన పద్ధతులను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని లేఖతో పాటు ఆయా జాబితాల ప్రతులను జతపరిచారు.
