AP DGP: గత కొంతకాలంగా సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతోందన్నారు ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు. 2024లో సైబర్ నేరాల ద్వారా మోసగాళ్లు రూ.1,229 కోట్లు తస్కరించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని, అలాంటి బెదిరింపులను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు. ఈ ఏడాది సైబర్ క్రైమ్ కు సంబంధించి 916 కేసులు నమోదు చేశామని డీజీపీ వెల్లడించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఈగల్’ వ్యవస్థ గంజాయి, డ్రగ్స్ కేసుల్లో ప్రజల్లోకి బలంగా వెళుతోందని అన్నారు. గంజాయి కాకుండా ఇతర పంటలు సాగు చేయాలని గిరిజనులకు చెబుతున్నామని డీజీపీ వెల్లడించారు.
సామాజిక మాధ్యమాల్లో అభ్యంతకర పోస్టులు పెట్టడంపై ఇప్పటిదాకా 572 కేసులు నమోదు చేశామని, ఆయా కేసుల్లో నిందితులపై రౌడీ షీట్ తరహాలో సైబర్ షీట్ తెరుస్తామని చెప్పారు.మార్చి 31 నాటికి కమాండ్ కంట్రోల్ కార్యాలయంతో 1 లక్ష సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తామని చెప్పారు. ఇప్పటికే 25 వేల సీసీ కెమెరాలను వినియోగిస్తున్నామని తెలిపారు.
ఇక, దేశంలో తొలిసారిగా ఏపీలోనే ‘స్మార్ట్ పోలీస్ ఏఐ’ని ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఏలూరు జిల్లా పోలీసులు ‘స్మార్ట్ పోలీస్ ఏఐ’ని ప్రారంభించారని వివరించారు. నేరాల నమోదు నుంచి కేసు విచారణ వరకు ‘స్మార్ట్ పోలీస్ ఏఐ’ సాంకేతికత సాయం తీసుకుంటున్నట్టు వెల్లడించారు. విజయవాడలో ట్రాఫిక్, ప్రజా రద్దీ నియంత్రణకు ఏఐ సాంకేతికత ఓ అస్త్రంలా ఉపయోగపడుతుందని తెలిపారు.