Dharmendra: బాలీవుడ్ సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు, ఎంతో మంది అభిమానుల గుండెల్లో నిలిచిన ధర్మేంద్ర (89) ఇక లేరు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆరోగ్య సమస్యల కారణంగా నవంబర్ 11వ తేదీన ధర్మేంద్రను ముంబైలోని బ్రీచ్క్యాండీ ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చి, కుటుంబ సభ్యుల సమక్షంలో వైద్యం అందిస్తున్నారు. ముంబైలోని తన నివాసంలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
Also Read: Bandi sanjay: జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక పరికరాల ప్రారంభం
ప్రముఖుల సంతాపం
ధర్మేంద్ర మృతి పట్ల దేశంలోని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలుపుతూ, ధర్మేంద్ర మృతి భారతీయ సినిమాకు తీరని లోటు అని పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి ఆయన అందించిన అద్వితీయ నటన ఎందరో యువ నటులకు స్ఫూర్తిగా నిలుస్తుందని రాష్ట్రపతి కొనియాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలుపుతూ, ధర్మేంద్ర మృతితో భారతీయ సినీ చరిత్రలో ఒక శకం ముగిసిందని అన్నారు. ఆయన నటించిన ప్రతి పాత్రలో జీవించారని మోదీ గుర్తుచేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ధర్మేంద్ర కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఇరువురు నేతలు ప్రార్థించారు. ‘షోలే’ వంటి అనేక విజయవంతమైన చిత్రాల ద్వారా ధర్మేంద్ర తన నటనా శైలిని, ప్రభావాన్ని చూపించారు.
