Amrit Bharat Trains: వచ్చే రెండేళ్లలో దేశంలో మరో 50 అమృత్ భారత్ రైళ్లను అందుబాటులోకి తేనున్నట్టు కేంద్ర వెల్లడించింది. ఈ రెండేళ్లలోనే వాటిని తయారు చేసి ట్రాక్ ఎక్కించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే గతేడాది ప్రారంభించిన అమృత్ భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలోనే అమృత్ భారత్ 2.0 రైళ్లను కేంద్రం తయారు చేస్తున్నది. ఈ క్రమంలోనే తమిళనాడులోని చెన్నైలో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సందర్శించి, అక్కడ తయారవుతున్న అమృత్ భారత్ రైళ్లతోపాటు వందేభారత్ స్లీపర్ రైళ్ల తయారీని పరిశీలించారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ సుబ్బారావుతో కలిసి మంత్రి ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే రెండేళ్లలో 50 అమృత్ భారత్ రైళ్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
Amrit Bharat Trains: నిరుడు జనవరిలో అమృత్ భారత్ వెర్ఝన్ 1.0ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇప్పడు 2.0లో కొత్తగా 12 రకాల ఫీచర్లను తీసుకొస్తున్నారు. సెమీ ఆటోమేటిక్ కప్లెట్స్, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ ఫీచర్, మాడ్యులర్ టాయ్లెట్స్, ఎమర్జెన్సీ బ్రేక్ సిస్టమ్లను కొత్త వాటిలో జోడించారు. అంతేగాకుండా వందేభారత్ రైళ్లలోలాగే నిత్యం వెలిగే లైట్లు, చార్జింగ్ పోర్టులతో పాటు బెర్తుల డిజైన్ను కూడా మార్చారు. ఫ్యాంట్రీ కారును సమూలంగా మార్చారు. పేదలు, దిగువ తరగతి కుటుంబాల సేవే లక్ష్యంగా ఈ అమృత్ భారత్ 2.0 రైళ్లను తీసుకొస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.