KTR: తెలంగాణ రక్షణ, పారిశ్రామిక వృద్ధిలో మరో కీలక మైలురాయి నమోదైంది. మహబూబ్నగర్ జిల్లాలో నిర్మిస్తున్న ‘గిగా కారిడార్’ (Giga Corridor) లో అమరరాజా (Amara Raja) సంస్థ తన సరికొత్త ‘కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్’ (CQP) ను అధికారికంగా ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
రూ.9,500 కోట్ల పెట్టుబడి.. ఎనర్జీ రంగంలో పెద్ద అడుగు!
అమరరాజా సంస్థ మహబూబ్నగర్లో ఏకంగా రూ.9,500 కోట్ల భారీ పెట్టుబడితో ఒక పెద్ద బ్యాటరీ గిగాఫ్యాక్టరీని (Gigafactory) ఏర్పాటు చేస్తోంది. అందులో భాగమే ఇప్పుడు ప్రారంభమైన ఈ కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ (CQP).
ఈ ప్లాంట్ బ్యాటరీలకు సంబంధించిన రీసెర్చ్ (R&D) మరియు వాణిజ్య ఉత్పాదనల (Commercial Manufacturing) మధ్య ఒక వారధిలా పనిచేస్తుంది. అంటే, వచ్చే ఏడాది నుండి గిగాఫ్యాక్టరీలో బ్యాటరీల పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభం కావడానికి ముందే.. ప్రొడక్ట్ నాణ్యతను, డిజైన్ను ఇక్కడ టెస్ట్ చేసి క్వాలిఫై చేస్తారు.
మా ప్రయత్నాలు ఫలించాయి: కేటీఆర్ ఆనందం
ఈ ప్లాంట్ ప్రారంభం కావడంపై కేటీఆర్ స్పందిస్తూ.. తమ హయాంలో చేసిన కృషి సఫలం కావడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని అన్నారు.
-
అతిపెద్ద పెట్టుబడి: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడులలో ఎనర్జీ స్టోరేజ్ (Advanced Energy Storage) రంగంలో ఇదే అత్యంత భారీ పెట్టుబడి అని ఆయన గుర్తుచేశారు.
-
తెలంగాణ నంబర్ వన్: ఈ సరికొత్త ప్లాంట్ అందుబాటులోకి రావడం వల్ల భారతదేశంలోనే అడ్వాన్స్డ్ ఎనర్జీ స్టోరేజ్ మరియు బ్యాటరీ తయారీ రంగానికి తెలంగాణ ఒక ప్రధాన హబ్గా (కేంద్రంగా) మరింత బలోపేతం అవుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
