Bala Krishna: టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై సందడి చేశారు. దసరా శరన్నవరాత్రుల ఆరాధనలో భాగంగా శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి విచ్చేసిన బాలకృష్ణకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ, “లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అని తెలిపారు. అమ్మవారి దృష్టిలో అందరూ సమానమే. ఆమె ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణలో స్థానిక ఎన్నికల హడావుడి.. త్వరలో నోటిఫికేషన్!
ఇక దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేకంగా స్పందించిన బాలయ్య, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేసిన తీరు అభినందనీయమని అన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నిరంతరాయంగా దర్శనం కల్పించడం పట్ల దేవస్థానం అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి రోజు అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు లలితా త్రిపురసుందరీ దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను దర్శించుకోవడం బాలకృష్ణకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది.