TS Honey Trap:తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ఒకే విషయంపై చర్చించుకుంటున్నారు. పార్టీలకు సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకరితో ఒకరు గుసగుసలాడుతున్నారు. ఇంతకీ ఏంటా విషయం అనుకుంటున్నారా? అయితే… లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టార్గెట్గా హనీట్రాప్ నడుస్తోందా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోన్ నంబర్లను కనుక్కొని మరీ వీడియో కాల్స్ చేసి బెదిరిస్తున్నారా? అసెంబ్లీలో ఇవే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తెలియని నెంబర్ నుండి వీడియో కాల్స్ వచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి. పలువురు ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదు చేయగా… మరికొందరు మాత్రం బయటికి తెలిస్తే తలనొప్పి అంటూ కాముగా ఉంటున్నారట. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీలో, ఎల్పీ ముందు పలువురు ఎమ్మెల్యేలు ఈ విషయంపై చర్చించుకున్నారు. తనకి కాల్ వచ్చిందని ఒక ఎమ్మెల్యే చెప్పగా, తనకూ కాల్ వచ్చిందని మరో ఎమ్మెల్యే తెలిపారు. ఇక కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ఇదే అంశంపై చర్చించారు. తమకి అనుమానస్పద కాల్స్ వచ్చాయని, లేట్ నైట్ కాల్స్ రావడంతో తాము ఎత్తలేదని, ఒకరి విషయం మరొకరు చెప్పుకొని తమ అనుభవాలను పంచుకున్నారు.
ఇది కూడా చదవండి: Fire Accident: మిర్చి గిడ్డంగిలో భారీ అగ్నిప్రమాదం.. రూ.12 కోట్ల నష్టం
తమకు వీడియో కాల్స్ వచ్చినా… అనుమానంతో ఎత్తకుండా జాగ్రత్త పడ్డామని, పలువురు ఎమ్మెల్యేలు తమ సహచర ఎమ్మెల్యేలతో చెప్పుకున్నారు. ఇటీవల కాలంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకి ట్రాప్ కాల్ వచ్చింది. కాల్ చేసి 20 సెకండ్ల పాటు మాట్లాడిన అజ్ఙాత మహిళ.. ఆ సమయంలో ఇబ్బందికరంగా ప్రవర్తించి.. ఆ వీడియోను సదరు ఎమ్మెల్యేకి పంపించి.. డబ్బులు డిమాండ్ చేశారట. డబ్బులు పంపకపోతే పక్క పార్టీ గ్రూపుల్లో వీడియో వేస్తామని బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో అలెర్ట్ అయిన ఎమ్మెల్యే వీరేశం… జిల్లా ఎస్పీకి కాల్ చేసి విషయం చెప్పగా… విచారణ జరిపి నిందితులను అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది.
ట్రాప్ కాల్స్ అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాల్ చేసి వీడియో రికార్డు చేసి బీఆర్ఎస్, బీజేపీ గ్రూపుల్లో వేస్తామని బెదిరించడం….. బీఆర్ఎస్ పార్టీ నేతలకు కాల్ చేసి, వీడియోలను రికార్డు చేసి, కాంగ్రెస్, బీజేపీ గ్రూపుల్లో వేస్తామని బెదిరించడం చర్చగా మారింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ ప్రత్యర్థులు తమని ఇరికించే ప్రయత్నంగా కూడా పలువురు ప్రజా ప్రతినిధులు అనుమానిస్తున్నారు. ఆపదలో ఉన్న వారు కాల్ చేశారామో అని.. తెలియక కాల్ ఎత్తితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాప్ కాల్స్ వల్ల ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలలో కలవరం మొదలైంది. చేయని తప్పుకి బలి కావాల్సి వస్తుందని, దీనిపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. బయటికి వచ్చి చెప్పే వాళ్లు కొంతమంది ఉంటే… చెప్పని వాళ్లు ఇంకా ఎంతమంది ఉన్నారో!