Vladimir Putin: దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా అంతర్జాతీయ దౌత్యం వేడెక్కింది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit) కోసం భారత్కు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భారత్ మండపంలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత పర్యటనకు రావడం తొమ్మిది నెలల వ్యవధిలోనే ఇది రెండోసారి కావడం గమనార్హం. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్లతో కూడా ప్రధాని మోదీ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈ పర్యటన భారత్కు ఎందుకంత కీలకం..?
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ మోదీ-పుతిన్ భేటీ సాధారణమైనది కాదు..
-
ముడి చమురు భద్రత: మధ్యప్రాచ్యంలో ఘర్షణలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు దాదాపు 100 డాలర్ల మార్కుకు చేరింది. రూపాయి మారకం విలువపై ఒత్తిడి పెరుగుతున్న వేళ.. రష్యా నుంచి రాయితీపై నిరంతరాయంగా ముడి చమురు దిగుమతులు భారత్కు అత్యవసరం.
-
రక్షణ ఒప్పందాలు: సుఖోయ్ Su-57 అత్యాధునిక యుద్ధ విమానాల కొనుగోలు, బ్రహ్మోస్ అప్గ్రేడ్, ఎస్-400 డెలివరీలు మరియు భారత్లోనే విమానాల తయారీపై చర్చలు జరగనున్నాయి.
-
చెల్లింపుల వ్యవస్థ: అమెరికా ఆంక్షల నేపథ్యంలో డాలర్ అవసరం లేకుండా ద్వైపాక్షిక వాణిజ్యం కోసం రూపాయి-రూబుల్ చెల్లింపులు, బ్యాంకింగ్ నెట్వర్క్లను బలోపేతం చేయడంపై ఇరుదేశాలు దృష్టి సారించాయి.
