TGSRTC: హైదరాబాద్ మహానగరంలో శరవేగంగా విస్తరిస్తున్న నైట్ లైఫ్ కల్చర్, అర్ధరాత్రి ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 12 గంటల తర్వాత మెట్రో, సాధారణ సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో క్యాబ్లు, ఆటో డ్రైవర్లు వసూలు చేసే అధిక ఛార్జీల భారం నుంచి ప్రయాణికులకు ఊరట కల్పించేందుకు 24 గంటల నిరంతర బస్సు సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది.
ఈ సరికొత్త నైట్ బస్ సర్వీసులు ఆగస్టు 29 నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. రాత్రి పూట విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ఐటీ ఉద్యోగులు, రైల్వే స్టేషన్లకు వచ్చే ప్రయాణికులు, పర్యాటకులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 వరకు – తొలి దశలో 6 ప్రధాన రూట్లు..
ప్రయాణికుల రద్దీని బట్టి ప్రతి అరగంటకు, గంటకు ఒక బస్సు చొప్పున నడిపేలా అధికారులు షెడ్యూల్ సిద్ధం చేశారు..
-
సికింద్రాబాద్ ↔ కొండాపూర్ (రూట్ నం. 10H): సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ మీదుగా కొండాపూర్ వరకు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు 8 నుంచి 10 సర్వీసులు నడుస్తాయి.
-
బాచుపల్లి ↔ వేవ్రాక్ (రూట్ నం. 195W): ఐటీ కారిడార్లోని ఉద్యోగుల కోసం రాత్రి వేళల్లో ప్రతి గంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది.
-
సికింద్రాబాద్ ↔ హయత్నగర్ (రూట్ నం. 290U): సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్ నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. అర్ధరాత్రి రైళ్లలో వచ్చే దూరప్రాంత ప్రయాణికులకు ఇది సౌకర్యంగా ఉంటుంది.
-
సికింద్రాబాద్ ↔ పటాన్చెరు: పారిశ్రామిక ప్రాంతాల ఉద్యోగుల కోసం రాత్రివేళల్లో ప్రత్యేక బస్సులు నడుస్తాయి.
-
కోఠి ↔ పటాన్చెరు (డైరెక్ట్ & హైటెక్ సిటీ మీదుగా): కోఠి నుంచి పటాన్చెరు రూట్లో ప్రతి గంటకు ఒక బస్సు, అలాగే కోఠి నుంచి హైటెక్ సిటీ మీదుగా పటాన్చెరు మార్గంలో ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటాయి.
భవిష్యత్తులో పర్యాటక ప్రాంతాలకూ విస్తరణ:
మొదటి దశలో ఐటీ కారిడార్, రైల్వే హబ్లను అనుసంధానించే 6 రూట్లలో సర్వీసులు ప్రారంభించిన తర్వాత.. ప్రయాణికుల నుంచి వచ్చే ఆదరణను బట్టి నగరంలోని ఇతర చారిత్రక, పర్యాటక ప్రాంతాలకు కూడా 24 గంటల బస్సులను విస్తరిస్తామని గ్రేటర్ ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.
