Hyderabad Traffic Diversion: హైదరాబాద్ నగర ప్రయాణికులకు ట్రాఫిక్ పోలీసులు అత్యంత ముఖ్యమైన సూచనలు జారీ చేశారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన H-CITI ప్రాజెక్ట్ లో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణ పనులను వేగవంతం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేబీఆర్ పార్క్ చుట్టూ 360 డిగ్రీల వన్-వే విధానాన్ని అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చారు.
ఈ నిర్మాణాలు పూర్తయ్యే వరకు, అంటే దాదాపు రెండేళ్ల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
గూగుల్ మ్యాప్స్లో కొత్త రూట్ – 13 ఎగ్జిట్ పాయింట్లు..
వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు..
-
లేన్ మార్పులు & ఎగ్జిట్లు: వన్-వే లూప్ నుంచి బయటకు వెళ్లేందుకు 13 ఎగ్జిట్ పాయింట్లు, దారి మారడానికి 10 లైన్ చేంజర్లు ఏర్పాటు చేశారు. కేవలం ఈ 10 ప్రాంతాల్లో మాత్రమే లేన్ మారేందుకు అనుమతి ఉంటుంది.
-
గూగుల్ మ్యాప్స్ అప్డేట్: పార్కు చుట్టూ కొత్త యూ-టర్న్లు, ఎగ్జిట్ పాయింట్లతో కూడిన రూట్ మ్యాప్ను గూగుల్ మ్యాప్స్లో పొందుపరిచారు. ప్రయాణానికి ముందు మ్యాప్స్ చూసుకోవడం ద్వారా గమ్యస్థానాన్ని సులభంగా చేరుకోవచ్చు.
-
పోలీసుల హెచ్చరిక: సూచిక బోర్డులను గమనిస్తూ డ్రైవ్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాంగ్ సైడ్ డ్రైవింగ్ మరియు రాత్రి వేళల్లో అతివేగం వద్దని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ సూచించారు.
కీలక ప్రాంతాలకు ప్రయాణ మార్గాలు ఇవే:
-
పంజాగుట్ట నుంచి మాదాపూర్:ఎన్టీఆర్ భవన్ సిగ్నల్ వద్ద ఎడమవైపు తిరిగి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, మహారాజా అగ్రసేన్ చౌరస్తా, జర్నలిస్టు కాలనీ మీదుగా రోడ్ నంబర్ 45కు వెళ్లి.. అక్కడి నుంచి మాదాపూర్ చేరుకోవచ్చు. లేదా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ఎడమవైపునకు మళ్లవచ్చు.
-
అమీర్పేట్ నుంచి ఫిలింనగర్:జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి ఎడమవైపు తిరిగి టీడీపీ కార్యాలయం రోడ్డు వైపు వెళ్లాలి. బసవతారకం ఆసుపత్రి వద్ద నుంచి బీఆర్ఎస్ భవన్ రోడ్డుకు మళ్లి, పాత రూట్ ద్వారా ఫిలింనగర్కు చేరుకోవచ్చు.
-
అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ / పెద్దమ్మ గుడి:ఇకపై జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదుగా వెళ్లలేరు. అమీర్పేట్, యూసూఫ్గూడ వైపు నుంచి వెళ్లేవారు డొమినోస్ పిజ్జా సెంటర్ దాటిన తర్వాత ఎడమవైపు తిరిగి నేరుగా హైటెక్ సిటీ, పెద్దమ్మ గుడి రోడ్డుకు చేరుకోవాలి.
-
హైటెక్ సిటీ నుంచి ఫిలింనగర్:జూబ్లీహిల్స్ చెక్పోస్టు మీదుగా టీడీపీ కార్యాలయం, బసవతారకం ఆసుపత్రి, మహారాజా అగ్రసేన్ చౌరస్తా, జర్నలిస్టు కాలనీ రోడ్డు ద్వారా ఫిలింనగర్ చేరుకోవచ్చు.
-
ఫిలింనగర్ నుంచి పంజాగుట్ట:
ఈ మార్గంలో ఎలాంటి మార్పులు లేవు. గతంలో మాదిరిగానే జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, ఎన్టీఆర్ భవన్ వద్ద ఎడమవైపు రోడ్డు మీదుగా పంజాగుట్ట చేరుకోవచ్చు.
