CM Vijay vs Udhayanidhi: కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మేకేదాటు (Mekedatu) ఆనకట్ట నిర్మాణం, కావేరి నదీ జలాల పంపిణీ వివాదం తమిళనాడు శాసనసభను తీవ్రంగా వేడెక్కించింది. శుక్రవారం జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఇంకా ప్రతిపక్ష డీఎంకే (DMK) నేత ఉదయనిధి స్టాలిన్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది.
ఈ కీలక అంశంపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో ‘అఖిలపక్ష సమావేశం’ ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేయగా.. దాని అవసరం లేదని, సమస్యను ఎలా పరిష్కరించాలో తమ ప్రభుత్వానికి స్పష్టత ఉందని సీఎం విజయ్ తేల్చి చెప్పారు.
ఇది రైతుల సమస్య.. అఖిలపక్ష భేటీ ఏది?.. ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నాస్త్రాలు
సభలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ కావేరి నీటి కొరత వల్ల డెల్టా జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు..
-
ఐక్యత ఎక్కడ?: కర్ణాటక ప్రభుత్వం తమ హక్కుల కోసం తరచూ ఆల్ పార్టీ మీటింగ్లు పెట్టి ఒత్తిడి తెస్తోంది. మన ప్రభుత్వం తమిళనాడు రైతుల హక్కుల కోసం అఖిలపక్ష భేటీ ఎందుకు నిర్వహించడం లేదు? అని నిలదీశారు.
-
నీటి సాగు విస్తీర్ణం తగ్గింపు: గత ప్రభుత్వ హయాంలో 6.8 లక్షల ఎకరాల్లో సాగు జరిగితే, ప్రస్తుత పాలనలో నీరు లేక కేవలం 1.5 లక్షల ఎకరాలకే పరిమితమైందని ఆరోపించారు. సీఎం నేరుగా డెల్టా ప్రాంతంలో పర్యటించాలని కోరారు.
-
కర్ణాటక పర్యటనపై స్పష్టత ఏది?: సీఎం బెంగళూరు వెళ్లి మాట్లాడతారని ఒక మంత్రి, వెళ్లరని మరో ఇద్దరు మంత్రులు చెప్పడంపై లీక్ల రాజకీయం బయాటపడిందని ఎద్దేవా చేశారు.
చౌకబారు రాజకీయాలు చేయను.. ప్రయోజనాల కోసం అవమానానికైనా సిద్ధం.. సీఎం విజయ్ కౌంటర్
ప్రతిపక్షాల విమర్శలకు ముఖ్యమంత్రి విజయ్ అత్యంత ఘాటుగా సమాధానమిచ్చారు:
కావేరి, మేకేదాటు అంశంలో నా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదు. ఈ సమస్యపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాం. మా స్థిరమైన వైఖరి ఏంటో అసెంబ్లీ తీర్మానం ద్వారా స్పష్టం చేశాం. ఇందులో రాజకీయ ప్రయోజనం లేదా క్రెడిట్ కోసం ‘చీప్ పాలిటిక్స్’ చేయాల్సిన అవసరం నాకు లేదు. పొరుగు రాష్ట్రంతో చర్చలు జరపడం తప్పు కాదు.. నా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఏ స్థాయి అవమానాన్నైనా భరించేందుకు నేను సిద్ధం. ఈ సమస్యను న్యాయపరంగానే పరిష్కరిస్తాం.— జోసెఫ్ విజయ్ (తమిళనాడు ముఖ్యమంత్రి)
పేపర్లు చదవడం కాదని, రైతుల వద్దకు వెళ్లాలన్న ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ముందూ వెనుకా మొత్తం వాస్తవాలు, రికార్డులు చదివితే అసలు పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది అని విజయ్ చురకలంటించారు.
డీలిమిటేషన్ కలకలం & అరెస్ట్ వివాదం!
మరోవైపు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని అడ్డుకునేందుకు తమిళనాడు ఎంపీలతో శనివారం సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు.
ఇదే సమయంలో సీఎం విజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్టు చేయడం తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కావేరి అంశంపై తన గొంతు నొక్కడానికే ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుందని ఉదయనిధి ఆరోపించగా.. అసెంబ్లీలో ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIADMK) నేత ఎడప్పాడి పళనిస్వామి సైతం కురువై పంట నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఏంటీ మేకేదాటు ప్రాజెక్టు వివాదం?
కర్ణాటకలోని రామనగర జిల్లా కనకపుర వద్ద ₹9,000 కోట్ల అంచనా వ్యయంతో కావేరి నదిపై ‘మేకేదాటు’ జలాశయాన్ని నిర్మించాలని ఆ రాష్ట్రం ప్రతిపాదిస్తోంది. దీని ద్వారా బెంగళూరుకు తాగునీరు అందించడంతో పాటు 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. అయితే ఈ రిజర్వాయర్ నిర్మిస్తే తమిళనాడులోని కావేరి డెల్టాకు అందాల్సిన నీటి ప్రవాహం తగ్గిపోతుందని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
