POK: 

POK: భారత సాయం కోరిన పీఓకే నేత సర్దార్ అమన్ ఖాన్!.. రేషన్, మందులు లేవు.. బోర్డర్ తెరిస్తే భారత్‌కు వచ్చేస్తాం!

POK: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో స్థానిక నిరసనకారులు, పాక్ ప్రభుత్వానికి మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో అక్కడ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (JAAC) కీలక నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ భారతదేశాన్ని బహిరంగంగా సాయం అర్థించడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. ఇస్లామాబాద్ ప్రభుత్వం తమపై క్రూరమైన ఆర్థిక ఆంక్షలు విధించిందని, దీనివల్ల స్థానిక ప్రజలు కనీస అవసరాలైన అన్నపానీయాలు, ప్రాణరక్షక మందులు దొరక్క అల్లాడిపోతున్నారని ఆయన ఆరోపించారు.

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో దావానలంలా వైరల్ అవుతున్న ఒక వీడియో సందేశంలో అమన్ ఖాన్ భారత్‌కు గట్టి విజ్ఞప్తి చేశారు. “మానవతా దృక్పథంతో భారతదేశం వెంటనే స్పందించి మాకు రేషన్, వైద్య సహాయం అందించాలి. ఇందుకోసం లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వద్ద ఉన్న సరిహద్దు గేట్లను తెరవాలి” అని కోరారు. పీఓకేలో పరిస్థితులు ఇలాగే దిగజారితే, ఆకలి తట్టుకోలేక ఇక్కడి ప్రజలంతా సరిహద్దులు దాటి భారతదేశంలోకి శరణార్థులుగా వచ్చేందుకు అనుమతించాలని ఆయన ప్రతిపాదించారు.

రావల్‌కోట్ నగరంలో వేలాది మందితో నిర్వహించిన ఒక భారీ బహిరంగ సభలో అమన్ ఖాన్ పాక్ పాలకులకు హెచ్చరికలు జారీ చేశారు. “మన హక్కుల కోసం ఎల్‌ఓసీ వైపు కదరాలా?” అని ఆయన సభను ప్రశ్నించగా.. అక్కడి జనం “వెళ్దాం.. భారత్ వైపు వెళ్దాం” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శాంతియుతంగా హక్కులు అడుగుతున్న తమ ప్రజలపై పాక్ సైన్యం తూటాలతో దాడి చేస్తే.. తమకు కూడా ఎల్‌ఓసీ దాటడం మినహా మరో ప్రత్యామ్నాయ మార్గం లేదని స్పష్టం చేశారు.

గడిచిన నెల రోజులుగా పీఓకే వ్యాప్తంగా పాకిస్థాన్ ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా మిలిటెంట్ తరహా నిరసనలు ఉధృతమవుతున్నాయి. ప్రాథమిక సబ్సిడీలు, పన్ను సంస్కరణల డిమాండ్‌తో మొదలైన ఈ ప్రజా ఉద్యమం.. పాక్ సైన్యం చేస్తున్న దౌర్జన్యాల కారణంగా ఇప్పుడు ఏకంగా పాకిస్థాన్ నుంచే విముక్తి (స్వాతంత్ర్యం) కోరే అంతర్యుద్ధం వైపు మళ్లుతోందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *