Bandi Bhageerath: బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు బుధవారం ఉదయం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఒక మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అత్యాచారం చేశాడనే ఆరోపణలతో ఆయన ఈ నెల 16వ తేదీ రాత్రి అరెస్టయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితుడిని పూర్తి స్థాయిలో విచారించి, మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీసులు కోర్టును ఆశ్రయించారు.
బండి భగీరథ్ను వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం, బుధవారం ఉదయం చంచల్గూడ జైలు నుంచి భగీరథ్ను భారీ భద్రత నడుమ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మూడు రోజుల పాటు పోలీసులు ఆయనను ఈ కేసు విషయమై వివరంగా ప్రశ్నించనున్నారు.
మరోవైపు, బండి భగీరథ్పై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలని, రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసు పెట్టారని ఆయన తరఫు లాయర్లు కోర్టులో వాదించారు. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా వేశారు. అయితే, ఇరుపక్షాల వాదనలు విన్న మేడ్చల్ జిల్లా కోర్టు పోలీసుల వాదనతో ఏకీభవించింది. కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున ఆధారాల సేకరణ ముఖ్యమని భావించి, బెయిల్ పిటిషన్ను పక్కన పెట్టి పోలీసుల కస్టడీకి అనుమతినిచ్చింది. ఈ మూడు రోజుల విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
