Bomb Threat: హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) ఆదివారం ఒక బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. ఆమ్స్టర్డామ్ నగరం నుండి శంషాబాద్ వస్తున్న ఒక ప్రయాణికుల విమానంలో బాంబు ఉందంటూ ఎయిర్పోర్ట్ అధికారులకు ఒక అనామక ఈమెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో, విమానం ఎయిర్పోర్టులో ల్యాండింగ్ అయ్యేలోపే ఏ క్షణమైనా బాంబు పేలిపోవచ్చని గుర్తుతెలియని వ్యక్తి హెచ్చరించాడు. దీంతో విమానాశ్రయ అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
ఈమెయిల్ అందిన వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బంది (CISF) మరియు బాంబు స్క్వాడ్ రక్షణ చర్యలు ప్రారంభించారు. విమానం రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే, అందులోని ప్రయాణికులను అత్యంత జాగ్రత్తగా కిందకు దించారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసేందుకు ప్రయాణికులందరినీ వెంటనే సురక్షితమైన ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు.
ఆ తర్వాత భద్రతా సిబ్బంది విమానం లోపల, ప్రయాణికుల లగేజీల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. సుదీర్ఘ సోదాల అనంతరం విమానంలో ఎలాంటి బాంబు లేదా అనుమానాస్పద వస్తువులు లేవని అధికారులు నిర్ధారించారు. ఇదొక తప్పుడు సమాచారమని తేలడంతో ప్రయాణికులు, ఎయిర్పోర్ట్ సిబ్బంది అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ నకిలీ బాంబు బెదిరింపు మెయిల్పై విమానాశ్రయ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
