Rukmini Vasanth: కన్నడ చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన నటి రుక్మిణి వసంత్ నెట్టింట వైరల్ అవుతున్న తన నకిలీ ఫోటోలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆమె పేరిట కొన్ని అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియో క్లిప్స్ విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. దీనిపై రుక్మిణి వసంత్ స్పందిస్తూ అవన్నీ పూర్తిగా నకిలీవని తేల్చి చెప్పారు.
డీప్ఫేక్, ఏఐ (AI) ఫోటోలపై మండిపాటు
స్విమ్మింగ్ పూల్ వద్ద జరిగిన ఒక ఫోటోషూట్కు సంబంధించిన వీడియో క్లిప్స్, ఫొటోలు రుక్మిణి వసంత్ పేరిట ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. అయితే, సోషల్ మీడియాలో తన పేరిట సర్క్యులేట్ అవుతున్న ఆ పిక్స్ అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లేదా డీప్ఫేక్ టెక్నాలజీతో జనరేట్ చేసినవని ఆమె స్పష్టం చేశారు. ఆ ఫోటోలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవన్నీ పూర్తిగా సృష్టించబడిన నకిలీ చిత్రాలని వెల్లడించారు.
సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఇలా మార్ఫింగ్, మానిప్యులేట్ చేసిన కంటెంట్ను తయారు చేయడం, వాటిని ఇంటర్నెట్లో షేర్ చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య అని ఆమె మండిపడ్డారు. ఇది ఒకరి వ్యక్తిగత గోప్యతను (Privacy) తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు!
ఈ వ్యవహారాన్ని తాము చాలా సీరియస్గా తీసుకున్నామని రుక్మిణి వసంత్ తెలిపారు. టెక్నాలజీ ఆధారంగా నకిలీ ఫోటోలను సృష్టించి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
నెటిజన్లకు నటి రుక్మిణి వసంత్ విజ్ఞప్తి: “ఆన్లైన్లో ఉన్న ఆ ఫోటోలు నకిలీవని తెలిసినా.. దయచేసి ఆ కంటెంట్ను ఇతరులకు షేర్ చేయడం కానీ, వాటిని ప్రమోట్ చేయడం కానీ చేయవద్దు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను అడ్డుకోవడంలో అభిమానులు, నెటిజన్లు బాధ్యతగా వ్యవహరించాలి.”
ఇటీవల కాలంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్టార్ హీరోయిన్లు ఇలాంటి ఏఐ డీప్ఫేక్ బాధితులుగా మారుతుండటం ఇండస్ట్రీలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
