C.M. Ramesh: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం తరఫున మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటు సవాల్ విసిరారు. రాష్ట్రంలో తానేదో శాంతిదూతలా జగన్ మాట్లాడుతుంటే.. ఆయన మాటలు విని రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
80 శాతం మీపైనే ఆరోపణలు.. లేదంటే రాజకీయం వదిలేస్తా!
వివేకా హత్య ఎలా జరిగిందో, దాని వెనుక ఎవరున్నారో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ బాగా తెలుసని పయ్యావుల కేశవ్ అన్నారు. “వివేకా హత్యను ఎవరు చేశారు? ఎవరి పాత్ర ఉంది?” అనే విషయంపై మీ సొంత సోషల్ మీడియా వేదికల్లోనే ఒక పోల్ పెట్టి అడగండి అని జగన్కు సవాల్ విసిరారు. ఆ పోల్లో గనుక 80 శాతం కంటే ఎక్కువ మంది మీ వైపే వేలెత్తి చూపించకపోతే.. తాను తక్షణమే రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానని పయ్యావుల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ముద్దాయిలు జైల్లోనే ఉన్నారు..
ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) క్షుణ్ణంగా విచారించిందని, వాస్తవాలను బయటకు తీసిందని మంత్రి గుర్తుచేశారు. సీబీఐ విచారణ జరిపి వైఎస్ భాస్కర్ రెడ్డిని ముద్దాయిగా తేల్చడం వల్లే.. వాళ్లు ఇప్పటికీ జైలులోనే ఉన్నారనే విషయాన్ని జగన్ మర్చిపోవద్దన్నారు. ఇంత స్పష్టంగా నిజాలు తేటతెల్లమయ్యాక కూడా.. ఇంకా రాజకీయ కక్షలతో ఇతరులను ఈ కేసులోకి ఇరికించాలని చూడటం ఏంటని, అలాంటి వారిని ఏమనాలని ఆయన ప్రశ్నించారు.
సొంత బాబాయ్ హత్య కేసులోనే నిజాలను పక్కదారి పట్టించి, నిందితులకు కొమ్ముకాస్తూ.. ఇప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి జగన్ మాట్లాడటం అత్యంత హాస్యాస్పదంగా ఉందని పయ్యావుల కేశవ్ విమర్శించారు.
