Telangana Cabinet

Telangana Cabinet: ఈనెల 21న తెలంగాణ కేబినెట్ కీలక భేటీ

Telangana Cabinet: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగనుంది. రాష్ట్రంలో పాలనాపరమైన మార్పులు, తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలు వంటి పలు కీలక అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించి ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

కేబినెట్ సమావేశం నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో చర్చించాల్సిన ఆయా శాఖల ఎజెండా అంశాలను, వాటికి సంబంధించిన పక్కా తెలుగు అనువాద ప్రతిపాదనలను మంగళవారం సాయంత్రం 6 గంటల లోపు తప్పనిసరిగా సాధారణ పరిపాలన శాఖకు పంపాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఏ శాఖకైనా కేబినెట్ చర్చ పరిధిలోకి వచ్చే అంశాలు లేకపోయినా.. ఆ వివరాలతో కూడిన ‘నిల్’ నివేదికను కూడా నిర్ణీత గడువులోగా సమర్పించాల్సి ఉంటుందని నిబంధన పెట్టారు.

దీంతో పాటు పరిపాలన సజావుగా సాగడానికి వీలుగా సీఎస్ అధికారులకు మరో కీలక సూచన చేశారు. కేబినెట్ సమావేశం జరిగే సమయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులందరూ విధుల్లోనే ఉండాలని, ఏ ఒక్కరూ సెలవు పెట్టకుండా తప్పనిసరిగా తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులు, నిధుల మంజూరు, ప్రజలకు సంబంధించిన కీలక సమస్యలపై ఈ సమావేశంలో మంత్రిమండలి సుదీర్ఘంగా చర్చించనుండటంతో ఈ కేబినెట్ భేటీపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *