KBR Park Video: హైదరాబాద్ మహానగరంలో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నడుం బిగించింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ‘గ్రేడ్ సెపరేటర్ కారిడార్ ప్రాజెక్ట్’కు సంబంధించిన ఒక ప్రత్యేక యానిమేషన్ వీడియోను జీహెచ్ఎంసీ ఆదివారం (మే 17) అధికారికంగా విడుదల చేసింది. పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టకుండా, సరికొత్త సాంకేతికతతో ఈ ప్రాజెక్టును వేగవంతం చేయనున్నారు.
ఒక్క చెట్టునూ నరకం.. పర్యావరణానికి పెద్దపీట!
కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్ (Eco-Sensitive Zone) పరిధిలోకి వస్తున్నందున, పార్క్ అందాలకు గానీ, అక్కడి పర్యావరణానికి గానీ ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు ఈ ప్లాన్ డిజైన్ చేశారు. ‘జీరో పార్క్ ఇంట్రూజన్’ (పార్క్ లోపలికి ఎలాంటి నిర్మాణాలు వెళ్లకుండా) పద్ధతిలో, కేవలం రోడ్డు మధ్యలో ఉండే మీడియన్స్ను వాడుకుంటూనే ఫ్లైఓవర్లు, అండర్పాస్లను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం కేబీఆర్ పార్కులోని ఒక్క చెట్టును కూడా నరకబోమని అధికారులు ఘంటాపథంగా స్పష్టం చేశారు. ఒకవేళ సెంట్రల్ మీడియన్లో ఏవైనా చెట్లు అడ్డంగా ఉంటే, వాటిని అత్యాధునిక ‘ట్రాన్స్ప్లాంటేషన్’ పద్ధతి ద్వారా వేరే చోటికి సురక్షితంగా తరలిస్తారు.
కాంక్రీట్ వద్దు.. స్టీల్ ఫ్లైఓవర్లే ముద్దు!
ట్రాఫిక్ అంతరాయాన్ని తగ్గించడానికి జీహెచ్ఎంసీ ఈసారి సంప్రదాయ కాంక్రీట్ నిర్మాణాలకు స్వస్తి పలికి, స్టీల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోంది.
-
వేగవంతమైన పనులు: స్టీల్ నిర్మాణాల వల్ల పనులు సాధారణం కంటే 30 నుండి 40 రెట్లు వేగంగా పూర్తవుతాయి.
-
ట్రాఫిక్ మళ్లింపు అవసరం లేదు: పిల్లర్ల ఏర్పాటు మరియు పైభాగపు పనులు ఫ్యాక్టరీలోనే సిద్ధమై ఇక్కడికి వస్తాయి కాబట్టి, నిర్మాణ సమయంలో రోడ్లపై ట్రాఫిక్కు పెద్దగా ఇబ్బంది కలగదు.
ప్రాజెక్ట్ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే:
-
సిగ్నల్ ఫ్రీ జర్నీ: జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుండి ఫిలింనగర్ వరకు ప్రయాణం పూర్తిగా సిగ్నల్ ఫ్రీగా మారనుంది. రోడ్ నంబర్ 45, ఫిలింనగర్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, ముగ్ధా జంక్షన్లను కలుపుతూ ఈ ప్రాజెక్ట్ సాగనుంది. దీనివల్ల జూబ్లీహిల్స్ – మాదాపూర్ మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది.
-
72% తగ్గుముఖం పట్టనున్న కాలుష్యం: ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసరాల్లో వాయు కాలుష్యం ఏకంగా 72 శాతం వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
-
40 కోట్ల లీటర్ల ఇంధన ఆదా: వాహనాలు సిగ్నళ్ల వద్ద ఆగకుండా సాఫీగా సాగిపోవడం వల్ల ఏటా దాదాపు 40 కోట్ల లీటర్లకు పైగా ఇంధనం (పెట్రోల్/డీజిల్) ఆదా అవుతుంది.
-
కార్బన్ ఉద్గారాల నియంత్రణ: వాతావరణంలోకి విడుదలయ్యే 13.66 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నియంత్రించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం.
New Project In KBR Park #KBRPark #GHMC #Revanthreddy #Hyderabad #Telangana pic.twitter.com/jEGdlw3H2T
— Chandra Shekhar Pamena (@PamanaChan58316) May 17, 2026
