Ponglueti srinivas: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలు వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు.
గత ప్రభుత్వంలో అమలైన మంచి పథకాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. వచ్చే ఏప్రిల్ నెలలో కొత్త ఇళ్ల మంజూరు ప్రారంభిస్తామని, ఆ తర్వాత మరో మూడు దశల్లో కూడా ఇళ్ల మంజూరు కొనసాగుతుందని ప్రకటించారు. ప్రజలు గతంలో జరిగిన విషయాలను గుర్తుంచుకుని ప్రస్తుత ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తోందని విశ్వసించాలని కోరారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అభ్యర్థన మేరకు నియోజకవర్గానికి రూ.1.30 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎంపీ కడియం కావ్య వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆమె అన్నారు.
ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై విమర్శలు చేశారు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా పనిచేసినా ఎవరినీ ఎదగనీయకుండా ధృతరాష్ట్ర పాలన చేశారని ఆరోపించారు. పాలకుర్తిలో ప్రజలు తరిమికొట్టిన తర్వాత ఇప్పుడు వర్ధన్నపేట మునిసిపాలిటీపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
