Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవస్థాపనపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా నిర్వచించబడలేదని, ప్రభుత్వం పని చేసే స్థలమే నిజమైన రాజధానిగా పరిగణించబడతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల అభీష్టం, ఆర్థికవ్యవస్థ, భౌగోళిక పరిస్థితులు ఆధారంగా ప్రభుత్వం ఎక్కడ నుంచైనా పరిపాలన నిర్వహించవచ్చని, రాజధాని నగరం నిర్మాణాన్ని రాజకీయ ప్రచారంగా మారుస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడం భవిష్యత్ తరాలకు ప్రమాదమని హెచ్చరిస్తూ, పర్యావరణం, నీటి ప్రవాహాలు, రైతుల జీవనాధారాలకు భంగం కలిగే ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధిపరచడం సరికాదని అన్నారు. అమరావతి ప్రాజెక్టును నిర్దిష్ట వర్గాల ప్రయోజనాల కోసం మళ్ళీ ముందుకు తెస్తున్నారని, ప్రజా డబ్బును వృథా చేసే నిర్ణయాలకు వ్యతిరేకంగా తాను నిలబడతానని జగన్ పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాలకు బదులుగా సమగ్ర అభివృద్ధి పైనే భవిష్యత్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
