Bandi sanjay: నేటి కాలేజీ విద్యార్థులు సైతం బాలకృష్ణ సినిమాలపై బెట్టింగ్లు వేసుకుని మరీ థియేటర్లకు వెళ్తున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ‘అఖండ–2’ సినిమా వీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
బాలకృష్ణ నటన సీనియర్ ఎన్టీఆర్ను మరిపించే స్థాయిలో ఉందని బండి సంజయ్ కొనియాడారు. బాలకృష్ణను తెరపై చూస్తే పరమేశ్వరుడే ప్రత్యక్షమయ్యాడనే భావన కలిగిందని ఆయన అన్నారు. ‘అఖండ–2’ సినిమా చూసిన తర్వాత ఎంతో ఆనందం కలిగిందని తెలిపారు.
బాలకృష్ణలో సీనియర్ ఎన్టీఆర్ను చూస్తున్నట్లుగా అనిపిస్తోందని, ఆయన నటనలో ఆ స్థాయి ప్రభావం కనిపిస్తుందని చెప్పారు. దర్శకుడు బోయపాటి శ్రీను సంచలనాలకు మారుపేరని, ఆయన తెరకెక్కించే ప్రతి సినిమా సమాజానికి ఏదో ఒక సందేశాన్ని ఇస్తుందని ప్రశంసించారు.
పరమేశ్వరుడే బోయపాటిలో ఆవహించి ఈ చిత్రాన్ని తీయించాడేమో అన్న భావన కలిగిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ సినిమా చూసిన తర్వాత ఇప్పటివరకు తన జీవితం, సమయాన్ని వృథా చేసుకున్నానేమో అనే ఆలోచన కలిగిందని చెప్పారు. ఇకపై మిగిలిన జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం అంకితం చేయాలనే స్పూర్తిని ఈ చిత్రం ఇస్తోందని అన్నారు.
