Navjot Singh Sidhu: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ మళ్లీ వైట్ జెర్సీ ధరించి టెస్టుల్లోకి తిరిగి రావాలని, అదే తన కోరిక అని సిద్ధూ సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. కోహ్లీ పునరాగమనం 150 కోట్ల మంది భారతీయులకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. కోహ్లీ ఫిట్నెస్ను కొనియాడుతూ సిద్ధూ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు. “భగవంతుడు నాకు ఒక వరం ఇస్తే, కోహ్లీని టెస్ట్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేలా చేసి, మళ్లీ ఆడించాలని కోరుకుంటాను. అతని ఫిట్నెస్ 20 ఏళ్ల యువకుడిలా ఉంటుంది. అతను 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం లాంటివాడు” అని సిద్ధూ రాసుకొచ్చారు.
Also Read: Chhattisgarh: ఛత్తీస్గఢ్లో కోల్మైనింగ్ వ్యతిరేక పోరాటం హింసాత్మకం
విరాట్ కోహ్లీ ఈ ఏడాది మే 12, 2025న టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 123 టెస్టుల్లో 9,230 పరుగులు సాధించారు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నవరి 3, 2025న ఆస్ట్రేలియాతో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడారు. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీ20లకు, ఆపై టెస్టులకు వీడ్కోలు పలికి ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్పైనే దృష్టి సారించారు.టెస్టులకు దూరమైనప్పటికీ, వన్డేల్లో కోహ్లీ ఫామ్ అద్భుతంగా ఉంది. ఈ ఏడాది 13 ఇన్నింగ్స్ల్లో 65.10 సగటుతో 651 పరుగులు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్లలో వరుస సెంచరీలతో చెలరేగారు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడుతూ ఆంధ్రపై 131, గుజరాత్పై 77 పరుగులు చేసి తన మునపటి ఫామ్ను చాటుకున్నారు. ప్రస్తుతం కోహ్లీ జనవరి 11 నుంచి న్యూజీలాండ్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం సిద్ధమవుతున్నారు. సిద్ధూ కోరిక కేవలం అభిమానుల ఆశగానే మిగిలిపోతుందా లేదా కోహ్లీ తన నిర్ణయాన్ని పునరాలోచిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
