Karnataka: కర్ణాటక సీఎం పీఠంపై మరో నేత అధిరోహిస్తారా? అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిశాక ఇదే జరుగుతుందా? తొలినాళ్ల నుంచి జరుగుతున్న ప్రచారం నిజమవుతందా? కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం హామీ మేరకు మార్పు తథ్యమా? అంటే అవుననే సమాచారం వినిపిస్తున్నది. ఇప్పటి వరకూ ఆ నేత పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందా? జనవరి నెలలో ఆ మార్పు జరుగుతుందా? అన్న ప్రశ్నకు నిజమేనని విశ్లేషకులు సైతం చెప్తున్నారు.
Karnataka: తాజాగా రామనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ చేసిన ప్రకటన కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.ఈ వ్యాఖ్యల కలకలం కేంద్ర అధిష్టానానికి కూడా తాకింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిశాక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని ప్రకటించారు. ఏకంగా బెంగళూరులోని సువర్ణ విధాన సౌధలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకున్నారు.
Karnataka: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ విషయాలను చెప్పారు. శివకుమార్కు అవకాశం వచ్చింది. ఆయన త్వరలో ముఖ్యమంత్రి కానున్నారు. ఆయన ఇన్నాళ్లు పడిన కష్టం, శ్రమకు ఆయనకు ఆ పదవి వస్తుందని తామంతా ఆశిస్తున్నాం. ఇదే విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానానికి విన్నవించామని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో మీడియా ప్రశ్నలకూ ఆయన సమాధానాలు ఇచ్చారు.
Karnataka: అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు ఉన్న వారే సీఎంగా కొనసాగుతారు కదా? అన్న మీడియా ప్రశ్నలకు ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ స్పందించారు. నంబర్లతో పనిలేదని, అంతా అధిష్ఠానం నిర్ణయం మేరకే నిర్ణయం జరుగుతుందని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా స్పందించారు. సీఎం పదవి కోసం తాను ఎలాంటి బలప్రదర్శనలోనూ భాగస్వామ్యం కావడం లేదని స్పష్టంచేశారు.
Karnataka: ఇదే దశలో బల సమీకరణకు కర్ణాటక రాష్ట్రంలో విందు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఒక పక్క తామిద్దరి మధ్య విభేదాలు లేవని ఇటు సీఎం సిద్ధరామయ్య, అటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. అధికారం కోసం ఇరువర్గాలు కత్తులు దూసుకుంటున్నారు. ఒకరిని మించి ఒక వర్గం లీకులు ఇస్తూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. సీఎం పీఠాన్ని ఆశిస్తున్న డీకే శివకుమార్ సహా సుమారు 30 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇటీవలే ఓ విందుకు హాజరయ్యారు. దీన్నిబట్టి గుంబనంగా సీఎం పీఠం కోసం ఎవరి ప్రయత్నాలను వారు కొనసాగిస్తున్నారు. వర్గ రాజకీయాలు ఫలిస్తే ఒకవేళ సీఎం మార్పు వచ్చే జనవరిలో జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
