Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్రావు ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కీలక అంశాలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్కు (ప్రభాకర్రావుకు) సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించినప్పటికీ, ఆయన దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని లూథ్రా గట్టిగా వాదించారు.
ఐక్లౌడ్ పాస్వర్డ్లపై వివాదం
కోర్టు గతంలో ఆదేశించినప్పటికీ, నిందితుడు ఐక్లౌడ్ పాస్వర్డ్లను రీసెట్ చేసి, అందులోని వివరాలను దర్యాప్తు అధికారులకు చూపించడం లేదు. కేవలం రెండు పాస్వర్డ్లను మాత్రమే రీసెట్ చేసినా, ఆ రెండు అకౌంట్లలోని సమాచారాన్ని కూడా ముందే డిలీట్ చేశారు. ఇది దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నమే” అని సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన జస్టిస్ బీవీ నాగరత్న, “కోర్టు మధ్యంతర రక్షణ కల్పించడం వల్లే దర్యాప్తునకు సహకరించట్లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీనిపై మీ వాదన ఏమిటి?” అని ప్రభాకర్రావు తరఫు న్యాయవాది రంజిత్కుమార్ను ప్రశ్నించారు.
-
నిందితుడి తరఫు వాదన: ప్రభాకర్రావు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నారని వివరిస్తూ ఇప్పటికే ఒక అఫిడవిట్ దాఖలు చేసినట్లు న్యాయవాది రంజిత్కుమార్ ధర్మాసనానికి తెలిపారు.
-
ప్రభుత్వ అభ్యంతరం: అయితే, ఆ అఫిడవిట్ మంగళవారం సాయంత్రం 4 గంటలకు దాఖలు కావడంతో తాము దానిని పరిశీలించలేదని సిద్ధార్థ లూథ్రా తెలిపారు. దానిపై తమ అభిప్రాయం చెప్పడానికి కొంత సమయం ఇవ్వాలని కోరారు.
ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై గురువారం జరిగే విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
