Tragedy News: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఒక భారత సంతతి మహిళ జీవితాన్ని, ఆమె కనబోయే బిడ్డ ఆశలను చిదిమేసింది. 8 నెలల గర్భిణీ అయిన ఒక ఐటీ అనలిస్ట్, తన భర్త, కుమారుడితో కలిసి ఫుట్పాత్పై నడుస్తుండగా, వేగంగా వచ్చిన BMW కారు ఢీకొనడంతో ఆమెతో పాటు గర్భస్థ శిశువు కూడా మరణించారు. మృతురాలిని సమన్విత ధారేశ్వర్ (33) గా గుర్తించారు. ఆమె ఐటీ సిస్టమ్స్ అనలిస్ట్గా పనిచేస్తున్నారు. ఈ విషాద ఘటన సిడ్నీలోని హార్న్స్బీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. సమన్విత తన భర్త, మూడేళ్ల కుమారుడితో కలిసి ఫుట్పాత్పై నడుచుకుంటూ వెళ్తున్నారు. వీరు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండగా, అటువైపు వచ్చిన ఒక కియా కార్నివాల్ కారు డ్రైవర్ వారికి దారి ఇచ్చేందుకు వేగాన్ని తగ్గించారు. సరిగ్గా అదే సమయంలో, వెనుకవైపు నుంచి బేఖాతరుగా, అతి వేగంగా వచ్చిన ఒక BMW సెడాన్, కియా కారును బలంగా ఢీకొట్టింది.
ఇది కూడా చదవండి: Sathya Sai Baba: పుట్టపర్తిలో బాబా శత జయంత్యుత్సవాలు.. 9.2 కిలోల బంగారంతో సత్యసాయి విగ్రహం
ఈ ధాటికి కియా కారు అమాంతం ముందుకు దూసుకుపోయి, రోడ్డు దాటుతున్న సమన్వితను బలంగా తాకింది. ఆమె తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సమన్వితకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆమెను వెస్ట్మీడ్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను, ఆమె గర్భస్థ శిశువును కాపాడటానికి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఫలితం దక్కలేదు. తల్లి, గర్భస్థ శిశువు ఇద్దరూ మరణించారు. మరో కొన్ని వారాల్లో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న సమయంలో ఈ ఘోరం జరగడంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదానికి కారణమైన BMW కారును నడుపుతున్న ఆరోన్ పాపజోగ్లూ (19) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడిపై ‘ప్రమాదకరమైన డ్రైవింగ్ కారణంగా మరణానికి కారణమవ్వడం’, ‘నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా మరణానికి కారణమవ్వడం’, మరియు ‘జోయ్ చట్టం’ కింద ‘గర్భస్థ శిశువు మరణానికి కారణమవ్వడం’ వంటి తీవ్రమైన ఆరోపణల కింద కేసులు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా న్యాయమూర్తి ఆరోన్కు బెయిల్ మంజూరు చేయలేదు.
