77th Republic Day: సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నేడు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ఆయన అమర జవాన్ల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పతాకావిష్కరణ తర్వాత గవర్నర్ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీసులకు ఈ సందర్భంగా ఆయన అవార్డులను ప్రదానం చేశారు.
Also Read: Trivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా సిరివెన్నెల విగ్రహ ఆవిష్కరణ
వేడుకల్లో భాగంగా గవర్నర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలంగాణ ప్రగతిని వివరించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిందని, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ‘వికసిత్ భారత్’ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న క్యూర్, ప్యూర్, రేర్ (CURE, PURE, RARE) విధానాల వల్ల పాలనలో పారదర్శకత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్షేమ రంగంలో భాగంగా రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామని, ఇది వ్యవసాయ రంగానికి పెద్ద ఊరటనిచ్చిందని గుర్తుచేశారు.
గిరిజన సంస్కృతికి, అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను కూడా గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ములుగు జిల్లా మేడారంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు, అక్కడ 251 కోట్ల రూపాయలతో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భందోబస్తు నిర్వహించారు. దేశభక్తి గీతాలు, పోలీసుల కవాతుతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు మారుమోగాయి.
