Posani krishna Murali Arrest: నోటి దురుసుతో ఇష్టానుసారంగా నాటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను తిట్టిపోసిన నటుడు పోసాని కృష్ణ మురళికి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పోసానిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అక్కడ పోలీస్ స్టేషన్ లో పోసానిని సుమారు 9 గంటల పాటు విచారించారు. పోలీసుల విచారణలో పోసాని నోరు మెదపలేదని తెలిసింది. దీంతో పోసాని కృష్ణమురళిని రైల్వేకోడూరులో జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరిచారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జాము 5 గంటల వరకు ఇరుపక్షాలు తమ వాదనను జడ్జి ముందు వినిపించాయి. ఈ సందర్భంగా పోలీసుల తరఫు లాయర్లు 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి పోసానిని ఇవ్వాలని కోరారు.
Posani krishna Murali Arrest: వాదనలన్నీ విన్న కోర్టు పోసానికి మార్చి 13 వరకు అంటే 14 రోజుల రిమాండ్ విధించింది. పోసాని పై బీఎన్ఎస్ సెక్షన్ 111(1), సెక్షన్ 196(1), సెక్షన్ 79, సెక్షన్ 192, ఐపీసీలోని 354 ఏ1(4), 505(1) (సీ) సెక్షన్ల కింద పోసాని పై కేసులు నమోదు అయ్యాయి. పోసాని తరపున 20 మంది లాయర్లు హాజరయ్యారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలను మేజిస్ట్రేట్ ముందు వినిపించారు. పోసానిపై పెట్టిన సెక్షన్స్ కరెక్ట్ కాదని ఆయన చెప్పారు. కానీ, కోర్టు మహిళలపై పోసాని చేసిన వ్యాఖ్యలు లైంగిక వేధింపుల కిందకే వస్తాయని కోర్టు పేర్కొంది. కోర్టు నిర్ణయం తరువాత పోసానిని కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మొత్తంగా చూసుకుంటే, పోసాని కృష్ణ మురళి తన నోటి దురుసుతనానికి భారీగానే మూల్యం చెల్లించుకుంటున్నట్టు కనిపిస్తోంది.

