Viksit Bharat Ganesh

Viksit Bharat Ganesh: రోబోటిక్ మూషిక సైన్యంతో ‘వికసిత్ భారత్ గణపతి’

Viksit Bharat Ganesh: భాగ్యనగరంలో వినాయక చవితి అంటేనే సృజనాత్మకతకు పెట్టింది పేరు. భక్తితో పాటు సమకాలీన అంశాలు, దేశభక్తిని మేళవిస్తూ వినూత్న రీతుల్లో గణనాథులను తీర్చిదిద్దడంలో నగర యువత ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా పాతబస్తీ ఉప్పుగూడ లలితాబాగ్‌లో కొలువుదీరిన ‘వికసిత్ భారత్ గణపతి’ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటూ సరికొత్త ట్రెండ్‌గా నిలుస్తున్నాడు. మెటాలిక్ ఆర్మోర్ (కవచం) ధరించి, సైనికులను తలపించేలా రోబోటిక్ మూషిక వాహనాలు ముందు నిలబడి ఉండగా దర్శనమిస్తున్న ఈ బొజ్జ గణపయ్య ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారాడు.

50వ వార్షికోత్సవం వేళ వినూత్న థీమ్..

ఉప్పుగూడ లలితాబాగ్‌లోని మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేకమైన మండపాన్ని రూపొందించింది.

1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, 2047 నాటికి దేశం 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. ప్రధాన మంత్రి మోదీ కలల ప్రాజెక్ట్ అయిన ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ థీమ్‌ను ఎంచుకున్నామని నిర్వాహకుడు శ్రీకాంత్ తెలిపారు. గతేడాది వీరు ‘ఆపరేషన్ సిందూర్’ థీమ్‌తో మండపాన్ని ఏర్పాటు చేశారు.
మెటాలిక్ కవచం.. రోబోటిక్ మూషిక సైన్యం..
సాధారణ సాంప్రదాయ రూపాలకు భిన్నంగా, ఒక ఆర్టిస్ట్ సహాయంతో గణనాథుడికి అధునాతన మెటాలిక్ కవచం (metallic armour), ప్రత్యేక కిరీటం, ఆభరణాలు తొడిగి గంభీరమైన రోబోటిక్ రూపంలో విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
స్వామివారి వాహనమైన మూషికాలను వివిధ మెకానికల్/రోబోటిక్ డిజైన్లలో తయారు చేసి, ఒక సైనిక దళం తమ నాయకుడి ముందు కవాతు చేస్తున్న రీతిలో పరేడ్ ఫార్మేషన్‌లో అమర్చారు. భక్తితో పాటు శాస్త్ర సాంకేతికత, దేశభక్తిని మేళవించిన ఈ దృశ్యం భక్తులకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది.
బుల్లెట్ ట్రైన్, ఎడ్లబండ్ల ప్రదర్శనతో నిమజ్జనం..
ఈ వికసిత్ భారత్ వినాయకుడి ప్రయాణం కూడా అంతే వినూత్నంగా సాగనుంది. సెప్టెంబర్ 25న జరిగే సామూహిక నిమజ్జన ఊరేగింపులో ఈ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌కు తరలించనున్నారు.

ఈ గ్రాండ్ శోభాయాత్రలో రోబోటిక్ మూషికాలతో పాటు, ఆధునిక భారతదేశ ప్రగతికి ప్రతీకగా మినీ బుల్లెట్ ట్రైన్ మోడల్, భారతీయ గ్రామీణ మూలాలను ప్రతిబింబించే ఎడ్లబండిలను కూడా ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శించనున్నట్లు అసోసియేషన్ సభ్యులు సుశీల్ కుమార్ వెల్లడించారు. సాంకేతికత, భక్తి, జాతీయ దృక్పథాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన లలితాబాగ్ గణపతిని దర్శించుకునేందుకు స్థానికులతో పాటు నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *