Udhayanidhi Stalin

CM Vijay: జ్యోతిష్యుడి నియామకంపై దుమారం.. సనాతన చర్చతో వేడెక్కిన అసెంబ్లీ!

CM Vijay: తమిళనాడు రాజకీయాలో ఆసక్తికరమైన విషయాలు చోటుచేసుకుంటున్నాయి.  మంగళవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ బలపరీక్షను ఎదుర్కొన్న సందర్భంలో, పరిపాలనాపరమైన అంశాల కంటే ఆయన వ్యక్తిగత విశ్వాసాలు ఇంకా జ్యోతిష్యుడి నియామకంపైనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ పరిణామాలు అటు అసెంబ్లీలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ పెను దుమారాన్ని రేపుతున్నాయి.

తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన విజయ్, తన వ్యక్తిగత జ్యోతిష్యుడిని ముఖ్యమంత్రి కార్యాలయంలో (CMO) కీలక పదవిలో నియమించడం ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువైంది. ఒకవైపు ద్రవిడ సిద్ధాంతాలు, శాస్త్రీయ ఆలోచనల గురించి చర్చ జరుగుతున్న తరుణంలో, ఈ నియామకం అశాస్త్రీయమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జ్యోతిష్యుడికి అధికారిక హోదా: మిత్రపక్షాల అసహనం

విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రికి ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’ (OSD)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని ఆయన మిత్రపక్షమైన విడుదలై చిరుతైగల్ కట్చి (VCK) తీవ్రంగా తప్పుపట్టింది. ప్రభుత్వం శాస్త్రీయ ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలి కానీ జ్యోతిష్యానికి కాదని VCK ఎమ్మెల్యే వన్ని అరసు అసెంబ్లీలో పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపక్ష డీఎండీకే నేత ప్రేమలత విజయకాంత్ కూడా ఈ నియామకాన్ని తప్పుపడుతూ, ఇది యువతకు తప్పుడు సందేశాన్ని పంపుతుందని విమర్శించారు.

అసెంబ్లీలో ఉదయనిధి వర్సెస్ విజయ్

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్, ముఖ్యమంత్రి విజయ్‌ను ఉద్దేశించి చేసిన “సనాతన నిర్మూలన” వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ప్రజలను విడదీసే సనాతన ధర్మాన్ని రూపుమాపాలని ఉదయనిధి ప్రకటించగా, విజయ్ దానికి ప్రతిస్పందనగా కేవలం చేతులు జోడించి నమస్కరించారు. అనంతరం తన ప్రసంగంలో విజయ్ మాట్లాడుతూ.. టీవీకే (TVK) పార్టీ ఎవరి అభిప్రాయాలనైనా సమానంగా గౌరవిస్తుందని, మంచిని స్వీకరిస్తామని చెప్పారు. అయితే, ఈ వివాదం ముదిరిన కొద్దిసేపటికే జ్యోతిష్యుడి నియామక ప్రకటన రావడంపై డీఎంకే వర్గాలు ఎద్దేవా చేశాయి.

మతం మరియు ప్రమాణ స్వీకారం

విజయ్ తన ప్రమాణ స్వీకార సమయంలో తన పూర్తి పేరును “సి. జోసెఫ్ విజయ్” అని ఉచ్చరించడం మరియు మనస్సాక్షికి బదులుగా “ఆండవన్” (దేవుడు) పేరుతో ప్రమాణం చేయడం ద్రవిడ రాజకీయాల్లో ఒక కొత్త మార్పుగా భావిస్తున్నారు. గతంలో ద్రవిడ నాయకులు మతాతీత ధోరణిని అనుసరించేవారు. ఈ మార్పు కారణంగా గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌లో విజయ్ మతం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా నాగాలాండ్, గోవా, మేఘాలయ వంటి క్రైస్తవ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల నుండి ఈ సెర్చ్‌లు ఎక్కువగా రావడం గమనార్హం.

ముఖ్యమంత్రి విజయ్ తన సినీ ఇమేజ్ నుండి బయటకు వచ్చి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారే క్రమంలో, ఇటువంటి వివాదాలు ఆయనకు సవాలుగా మారాయి. ఒకవైపు ద్రవిడ సిద్ధాంతాలను గౌరవిస్తూనే, మరోవైపు తన వ్యక్తిగత విశ్వాసాలను పరిపాలనలో భాగం చేయడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *