New Health Scheme: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ఒక కీలకమైన అడుగు ముందుకు వేసింది. ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (EHS) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (డిప్యూటీ సీఎం) మల్లు భట్టి విక్రమార్క సచివాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అధికారికంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజు సమక్షంలో ఉద్యోగులకు కొత్త హెల్త్ కార్డులను అందజేశారు.
“ఉద్యోగులంతా మన బిడ్డలే” – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
గతంలో వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడ్డామని ఉద్యోగులు తమ బాధలను పంచుకున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది ఉద్యోగులేనని, అందుకే వారిని తమ బిడ్డలుగా భావించి, పూర్తి ఆరోగ్య భరోసా ఇచ్చేందుకే ఈ నూతన స్కీమ్ను తీసుకొచ్చామని చెప్పారు. అన్ని శాఖలతో చర్చించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని స్పష్టం చేశారు.
నేటి నుంచే హెల్త్ కార్డులు.. పూర్తి నగదు రహిత చికిత్సలు!
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజు ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించారు:
-
హెల్త్ ఐడీ కార్డులు: నేటి నుంచే రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి, పెన్షనర్కు ప్రత్యేకమైన హెల్త్ ఐడీ కార్డులను జారీ చేయనున్నారు.
-
886 ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 886 నెట్వర్క్ ఆసుపత్రులలో ఈ కార్డు ద్వారా పూర్తిగా ఉచితంగా (నగదు రహిత – Cashless) చికిత్సలు పొందవచ్చు.
-
1,816 రకాల జబ్బులకు చికిత్స: దాదాపు 1,816 రకాల వైద్య పరీక్షలు, ఆపరేషన్లను ఈ పథకం కిందికి తీసుకొచ్చారు. వీటి కోసం ఉద్యోగులు ఆసుపత్రిలో రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.
-
24 వెల్నెస్ సెంటర్లు: ఉద్యోగులకు మరింత సులభంగా వైద్య సేవలు అందించడానికి రాష్ట్రవ్యాప్తంగా 24 ప్రత్యేక వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎస్ వెల్లడించారు.
