Weather Update: తెలంగాణ రాష్ట్రంపై చలి ప్రభావం తీవ్రంగా ఉంది. శనివారం నుంచే మొదలైన చలి నవంబర్ 10 నుండి మరింత పెరిగింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, రాబోయే రోజుల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండొచ్చని అంచనా వేశారు. ఇప్పటికే శనివారం రాత్రి నుండి ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలోని బేల, రంగారెడ్డి జిల్లాలోని షాబాద్లో 14.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం, కొన్ని జిల్లాలను ముఖ్యంగా అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలను ముఖ్యంగా హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే కూడా తక్కువకు పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ చలి పులి నుంచి తమను తాము కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
చలి నుంచి రక్షణ కోసం ప్రజలు స్వెటర్లు, జాకెట్లు, మఫ్లర్లు వంటి వెచ్చని దుస్తులు ధరించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. శరీరం మొత్తం కప్పి ఉంచేలా దుస్తులు వేసుకోవడం మంచిది. అలాగే, వేడి సూప్లు, గోరువెచ్చని నీరు ఎక్కువగా తాగి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు మరియు చిన్న పిల్లలు ఉదయం వేకువజామున, రాత్రి పొద్దుపోయిన తర్వాత బయటకు వెళ్లకూడదు అని వారు చెప్పారు. చలి కారణంగా చర్మం పగలడం, పొడిబారడం జరగకుండా ఉండటానికి మంచి మాయిశ్చరైజర్ వాడాలని కూడా సూచిస్తున్నారు.
