Tamil Nadu: తమిళనాడు రాజకీయాలు నిమిషానికో మలుపు తిరుగుతున్నాయి. గత కొద్ది గంటలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కేరళ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకున్న ఆయన, టీవీకే (TVK) అధినేత విజయ్కు అపాయింట్మెంట్ ఇచ్చారు.
సాయంత్రమే కీలక భేటీ
ముందుగా నిర్ణయించిన ప్రకారం గవర్నర్ కేరళ వెళ్లాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి దృష్ట్యా ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు విజయ్ నేతృత్వంలోని బృందం గవర్నర్ను కలవనుంది. ప్రస్తుతం విజయ్ లోక్భవన్ సమీపంలోని ఒక పార్టీ నాయకుడి నివాసంలోనే వేచి చూస్తున్నారు.
విజయ్ చేతిలో 120 మంది ఎమ్మెల్యేల మద్దతు?
ఈ భేటీలో విజయ్ తన వెంట ఉన్న 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్కు సమర్పించనున్నారు. మెజారిటీకి కావాల్సిన బలం తన వద్ద ఉందని నిరూపించుకోవడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశ్యం. ఒకవేళ గవర్నర్ ఆ లేఖను పరిశీలించి సంతృప్తి చెందితే, విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉంది.
ఉత్కంఠలో అభిమానులు
మరోవైపు విజయ్ అభిమానులు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో లోక్భవన్ పరిసరాలకు చేరుకుంటున్నారు. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం దిశగా వేస్తున్న ఈ అడుగు తమిళ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
మరికాసేపట్లో జరగబోయే ఈ భేటీ తర్వాత తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడనుందా? లేదా గవర్నర్ మరికొంత సమయం తీసుకుంటారా? అన్నది వేచి చూడాలి.
