Tamil Nadu: తమిళనాడు రాజకీయాలు నిమిష నిమిషానికి ఉత్కంఠ రేపుతున్నాయి. కొత్త పార్టీ పెట్టి అధికార పీఠం దిశగా అడుగులు వేస్తున్న టీవీకే (TVK) అధినేత, నటుడు విజయ్కు గవర్నర్ అర్లేకర్ నుంచి మరోసారి చుక్కెదురైంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంపూర్ణ బలం తన వద్ద ఉందని నిరూపించుకునేందుకు గవర్నర్ను కలిసేందుకు వెళ్లిన విజయ్కు నిరాశే మిగిలింది. అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో రాజ్భవన్ మెట్ల వరకు వెళ్లిన ఆయన, చేసేదేమీ లేక తిరిగి తన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ పరిణామం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
నిజానికి, గత మూడు సార్లు తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు లేదన్న కారణంతో గవర్నర్ విజయ్ను వెనక్కి పంపారు. అయితే, తాజాగా వీసీకే (VCK), ముస్లిం లీగ్ వంటి పార్టీలు విజయ్కు మద్దతు ప్రకటించడంతో ఆయన బలం 120కి చేరింది. దీంతో మేజిక్ ఫిగర్ దాటినట్లయిందని, ఇక ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిందని అందరూ భావించారు. కానీ, కీలక సమయంలో గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం గమనార్హం. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటం వల్లే కలవలేకపోయారని గవర్నర్ కార్యాలయం చెబుతున్నప్పటికీ, దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గవర్నర్ తీరుపై టీవీకే నేతలు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా గవర్నర్ కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు మండిపడుతున్నారు. గవర్నర్ అర్లేకర్ ఈ రాత్రి 7:30 గంటలకు కేరళ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో, ఆయన తిరిగి వచ్చేవరకు ఈ సస్పెన్స్ కొనసాగేలా కనిపిస్తోంది. సంపూర్ణ బలం ఉన్నా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడాన్ని టీవీకే వర్గాలు తప్పుబడుతున్నాయి.
మొత్తానికి తమిళనాడులో ‘గవర్నర్ వర్సెస్ విజయ్’ అన్నట్లుగా పరిస్థితులు మారాయి. బల నిరూపణకు సిద్ధంగా ఉన్నా, సాంకేతిక కారణాలు చూపుతూ కాలయాపన చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గవర్నర్ కేరళ పర్యటన ముగించుకుని వచ్చాక విజయ్కు అవకాశం ఇస్తారా? లేక ఈ రాజకీయ చదరంగంలో మరిన్ని మలుపులు చోటుచేసుకుంటాయా? అన్నది వేచి చూడాలి.
