Revanth Reddy

Revanth Reddy: ధాన్యం కొనుగోళ్లలో అశ్రద్ధ వద్దు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్!

Revanth Reddy: రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతుల నుంచి పంటను సేకరించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడుతూ.. క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోలు కేంద్రాలను స్వయంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

రైతులకు ఇబ్బంది కలగకూడదు
ధాన్యం సేకరణ సమయంలో గోనె సంచులు, హమాలీల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని, లారీల ఏర్పాటులో జాప్యం చేసే కాంట్రాక్టర్లపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనకాడవద్దని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై సైతం చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

అవసరమైతే ఫంక్షన్ హాళ్లలో నిల్వ
గోదాముల్లో నిల్వ సామర్థ్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ధాన్యం తడవకుండా ఉండేందుకు రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను తాత్కాలికంగా వినియోగించుకోవాలని చెప్పారు. ముఖ్యంగా మొక్కజొన్న పండించే జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండి, రైతులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. అవసరమైన చోట పోలీసుల సహాయం తీసుకుని కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని, ప్రతిరోజూ దీనిపై నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (CS) పంపాలని సీఎం ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *