Raksha Bandhan 2026: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే పవిత్ర పండుగ రక్షాబంధన్. శ్రావణ పౌర్ణమి సందర్భంగా జరుపుకునే ఈ వేడుకలో సోదరీమణులు తమ సోదరుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, విజయాలను కాంక్షిస్తూ రక్షాసూత్రాన్ని (రాఖీ) కడతారు.
అయితే, రక్షాబంధన్ రోజున రాఖీ కట్టేటప్పుడు కొన్ని శాస్త్ర నియమాలు, పద్ధతులను పాటించడం వల్ల సంపూర్ణ పూజాఫలం దక్కుతుందని, సోదరుడి జీవితంలో శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. రాఖీ కట్టేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు..
1. భద్ర కాలం & రాఖీ ఎంపికలో జాగ్రత్తలు..
-
భద్ర కాలంలో కట్టకూడదు: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భద్ర కాలంలో రాఖీ కట్టడం అశుభంగా భావిస్తారు. అయితే, ఈసారి భద్ర కాల ప్రభావం లేకపోవడం శుభపరిణామం.
-
పవిత్రమైన దారాలనే వాడాలి: ఎట్టిపరిస్థితుల్లోనూ తెగిపోయిన లేదా పాడైపోయిన రాఖీలను ఉపయోగించకూడదు. అలాగే ప్లాస్టిక్ రాఖీలు లేదా ప్లాస్టిక్ బియ్యం వాడటం నిషిద్ధం. పట్టు దారాలు, నూలు దారాలు లేదా కలవా (రక్షా దారం)తో తయారు చేసిన శుభప్రదమైన రాఖీలను మాత్రమే సోదరుడి మణికట్టుకు కట్టాలి.
2. కూర్చునే దిశ & సరైన పద్ధతి..
రాఖీ కట్టేటప్పుడు దిశల ఎంపిక అత్యంత కీలకం..
-
ముఖాముఖి దిశలు: రాఖీ కట్టించుకునే సమయంలో సోదరుడు తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ముఖం చేసి కూర్చోవాలి. సోదరి పశ్చిమ దిశ వైపు తిరిగి ఉండటం శుభప్రదం. పొరపాటున కూడా దక్షిణ దిశ వైపు కూర్చోకూడదు.
-
తల, చేతులు ఖాళీగా ఉండకూడదు: సోదరుడు రాఖీ కట్టించుకునే సమయంలో తలపై రుమాలు లేదా వస్త్రం కప్పుకోవాలి (ఖాళీ తలతో కూర్చోకూడదు). అలాగే చేతిలో కొద్దిగా అక్షతలు, కొబ్బరికాయను ఉంచుకోవడం శ్రేయస్కరం.
3. తిలకం మరియు అక్షతలు దిద్దే సరైన విధానం..
కేవలం దారం కట్టేయడంతో రక్షాబంధన్ పూజ పూర్తి కాదు. నిర్దేశిత క్రమంలో పూజా విధానాన్ని పూర్తి చేయాలి..
-
కుంకుమ, చందన తిలకం: రాఖీ కట్టడానికి ముందు సోదరుడి నుదుటిపై రోలీ (కుంకుమ) మరియు గంధంతో తిలకం దిద్దాలి.
-
అక్షతలు ఉంచడం: తిలకం పెట్టిన వెంటనే విరగని బియ్యం (అక్షతలు) నుదుటిపై ఉంచాలి.
-
రక్షాసూత్రం & హారతి: తిలకం, అక్షతలు పెట్టిన తర్వాతే కుడి చేతి మణికట్టుకు రాఖీ కట్టి, మిఠాయి తినిపించి మంగళహారతి ఇవ్వాలి.
ఈ చిన్న నియమాలను పాటిస్తూ రాఖీ పండుగను జరుపుకోవడం వల్ల అన్నాచెల్లెళ్ల బంధం మరింత పటిష్టమై, సోదరుడికి దీర్ఘాయుష్షు లభిస్తుందని నమ్ముతారు.
