Suspended: పాఠశాలలో విద్యార్థులకు క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పించి రక్షణగా నిలవాల్సిన ఒక ప్రధానోపాధ్యాయుడు( ప్రిన్సిపల్ )హద్దులు దాటి ప్రవర్తించిన ఘటన రాజస్థాన్లో తీవ్ర దుమారం రేపింది. ఆగస్టు 15 వేడుకల అనంతరం విద్యార్థినులను సమీపంలోని జలాశయం (డ్యాం) వద్దకు తీసుకెళ్లి, వారితో కలిసి అసభ్యకర రీతిలో ఈత కొట్టిన ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్పై విద్యాశాఖ సస్పెన్షన్ వేటు వేసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారి, ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో ఉన్నతాధికారులు వేగంగా స్పందించారు.
వివరాల్లోకి వెళ్తే..
ఆగస్టు 15 వేడుకలు ముగిసిన తర్వాత ప్రిన్సిపల్ లాల్చంద్ మీనా పాఠశాలకు చెందిన 200 మందికి పైగా విద్యార్థులను.. సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలోని డ్యాం వద్దకు తీసుకెళ్లారు. వీరిలో 9 నుంచి 12వ తరగతి చదువుతున్న 20–25 మంది విద్యార్థినులు ఉన్నారు. గతంలో పలువురు మునిగిపోయిన ప్రమాదకరమైన డ్యాం వద్దకు ఎలాంటి లైఫ్జాకెట్లు లేదా ప్రాథమిక భద్రతా ఏర్పాట్లు లేకుండా విద్యార్థులను నీటిలోకి అనుమతించారు. చాలామంది విద్యార్థులకు ఈత కూడా రాదు అని తెలుస్తుంది. ప్రిన్సిపల్ లాల్చంద్ మీనా దుస్తులు లేకుండా నీటిలో ఈత కొడుతూ, ఒక విద్యార్థినిని చేతులతో పైకి ఎత్తుతూ అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన గ్రామస్తులు పాఠశాలకు చేరుకుని నిరసన వ్యక్తం చేయడంతో పాటు పోలీసులకు సమాచారం అందించారు.
-
విచారణ నివేదిక: బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO) ప్రాథమిక విచారణ జరిపి, సీల్డ్ కవర్లో సమగ్ర నివేదికను విద్యాశాఖ ప్రధాన కార్యాలయానికి పంపారు.
-
వెంటనే సస్పెన్షన్: ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిని పూర్తిగా ఉల్లంఘించినట్లు తేలడంతో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ లలిత్ కుమార్ ప్రిన్సిపల్ లాల్చంద్ మీనాను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆయన హెడ్క్వార్టర్స్ను బికానెర్కు మార్చారు.
నిందితుడిపై పూర్తిస్థాయి శాఖాపరమైన విచారణతో పాటు చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.
