Prabhas Fauj: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజీ‘ (Fauji) షూటింగ్ సెట్స్ కి వెళ్తున్న ప్రొడక్షన్ వెహికల్ కి ఆక్సిడెంట్. హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఇంకా దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ‘ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా సెట్స్కు వెళ్తుండగా, మంగళవారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది.
అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన కారు
సినిమా ప్రొడక్షన్ పనుల నిమిత్తం ఆరుగురు సభ్యులు ఒక కారులో బయలుదేరారు. హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోకి రాగానే, కారు అకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను అతివేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ ఢీకొన్న వేగానికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.
ఒకరి మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం
ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం ఆరుగురు ఉన్నారు. వీరిలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కు చెందిన ఒక వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. మిగిలిన ఐదుగురు సభ్యులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను పోలీసుల సహాయంతో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
దిగ్భ్రాంతిలో చిత్ర యూనిట్
ఈ వార్త తెలియడంతో ‘ఫౌజీ’ చిత్ర యూనిట్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం యూనిట్ సభ్యులు ఎంతో కష్టపడుతున్న సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం కలచివేసింది. ప్రమాద సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అతివేగం లేదా డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.
