Pawan Kalyan: ఒకవైపు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా కాలుష్యం వెదజల్లడం.. మరోవైపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్ల రూపాయల పన్నులను ఏళ్ల తరబడి ఎగ్గొట్టడంపై డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజమండ్రిలోని ప్రముఖ పరిశ్రమ ‘ఆంధ్రా పేపర్స్’ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులను ఆదేశించారు.
2016 నుంచి ఒక్క పైసా కట్టలేదు.. ఏకంగా రూ.21.34 కోట్ల బకాయిలు!
పరిశ్రమలు నడుపుతూ లాభాలు గడిస్తున్న యాజమాన్యం, ప్రభుత్వ ఖజానాకు మాత్రం పెద్దఎత్తున గండి కొడుతోందని పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. 2016 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఆంధ్రా పేపర్స్ సంస్థ ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించలేదని లెక్కలతో సహా బయటపెట్టారు. ఏకంగా రూ.21.34 కోట్ల పన్ను బకాయిలను నిస్సిగ్గుగా పెండింగ్లో పెట్టడంపై మండిపడ్డారు. కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్న ఒక దిగ్గజ సంస్థ, ప్రభుత్వ నియమనిబంధనలను ఇంత దారుణంగా గాలికొదిలేయడం క్షమించరాని నేరమని స్పష్టం చేశారు.
కాలుష్యంతో స్థానికుల విలవిల.. ఊపిరితిత్తుల్లోకి విషపు పొగలు
పన్నుల ఎగవేత ఒక ఎత్తయితే.. ఆ పరిశ్రమ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, రసాయనాల వల్ల రాజమండ్రి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేక, తీవ్రమైన కాలుష్యంతో ఆస్పత్రుల పాలవుతున్న పరిస్థితిపై పవన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల వ్యాపారం కోసం సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెడితే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు.
అధికారులకు స్పష్టమైన ఆదేశాలు: “తక్షణ చర్యలు తప్పవు”
ఎంతటి పెద్ద సంస్థ అయినా సరే, చట్టానికి ఎవరూ అతీతులు కారని పవన్ హెచ్చరించారు. తక్షణమే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రంగంలోకి దిగి, పరిశ్రమపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ, ప్రభుత్వ సొమ్మును ఎగ్గొట్టే సంస్థలకు ప్రభుత్వం నుంచి ఇకపై ఎలాంటి రాయితీలు, మినహాయింపులు ఉండవని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
ప్రజా సంక్షేమం కోసం పవన్ కల్యాణ్ తీసుకున్న ఈ సత్వర నిర్ణయంపై రాజమండ్రి స్థానికులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
