Chandrababu Naidu: రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో భూ రికార్డుల్లో జరిగిన తప్పుల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం, వాటిని సరిచేసి సరికొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని నిశ్చయించింది. ఈ కొత్త పుస్తకాలు కేవలం కాగితాలు మాత్రమే కాదని, రైతులకు తమ భూమిపై ఉండే ధీమా అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఈ కొత్త పాస్ పుస్తకాల ముద్రణ విషయంలో ప్రభుత్వం అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది. పుస్తకం చేతికి వచ్చే ముందే గ్రామ సభల ద్వారా రైతుల దగ్గరకు వెళ్లి, వారి భూమి వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. రైతులు తమ వివరాలను ధృవీకరించిన తర్వాతే ముద్రణ జరుగుతుంది. దీనివల్ల రికార్డుల్లో తప్పులు దొర్లే అవకాశం ఉండదు. అంతేకాకుండా, ఎవరూ ట్యాంపరింగ్ చేయలేనంత పటిష్టంగా, నకిలీలకు తావులేకుండా ఈ పుస్తకాలను రూపొందించారు.
ఈ పాస్ పుస్తకాలపై మన దేశ గౌరవానికి చిహ్నమైన రాజముద్రతో పాటు, భద్రత కోసం ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రైతన్నల్లో స్ఫూర్తిని నింపేలా “మీ భూమి – మీ హక్కు”, “జై భారత్ – జై తెలుగుతల్లి” అనే నినాదాలను వీటిపై ముద్రించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భూమి రికార్డుల విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.
