Nepal Protest: నేపాల్లో సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చి, 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, సంబంధిత పక్షాలు సంయమనం పాటించాలని, సమస్యలను శాంతియుత చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మంగళవారం ఒక ప్రకటనలో, “నేపాల్లో జరిగిన ఘోర ఘటనలతో మేము చాలా విచారించాము. మృతుల కుటుంబాలతో మా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము” అని తెలిపింది. నేపాల్లో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, స్థానిక అధికారుల మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
కర్ఫ్యూ, ఆందోళనలు కొనసాగుతూనే
సోమవారం ఖాట్మండు, ఇటాహరి వంటి నగరాల్లో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. “ఇటీవలి కాలంలో పౌర అశాంతిపై జరిగిన అత్యంత ఘోర అణచివేత”గా హిమాలయన్ టైమ్స్ ఈ ఘటనను పేర్కొంది. ప్రధాన మంత్రి కె.పీ. శర్మ ఓలి రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Vizag Steel Plant: విశాఖ స్టీల్ప్లాంట్లో అగ్ని ప్రమాదం
మంగళవారం కూడా ఆందోళనలు తగ్గలేదు. ఉదయం నుంచి పార్లమెంటు సమీపంలో, కలంకి తదితర ప్రాంతాల్లో నిరసనకారులు రోడ్లను దిగ్బంధించారు. ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో రింగ్ రోడ్ ప్రాంతంలో ఖాట్మండు జిల్లా పరిపాలన నిరవధిక కర్ఫ్యూ విధించింది.
ప్రజల కోపం ఉధృతం
భద్రతా దళాల దాడుల్లో పలువురు యువకులు ప్రాణాలు కోల్పోవడం ప్రజల ఆగ్రహాన్ని మరింత పెంచింది. రిటైర్డ్ నేపాల్ ఆర్మీ కల్నల్ మాధవ్ సుందర్ ఖడ్గా మాట్లాడుతూ, తన కుమారుడు ఆందోళనల సమయంలో అదృశ్యమైందని, పోలీసుల దాడికి తాను కూడా గురయ్యానని ఆరోపించారు. “ప్రభుత్వం క్రూరంగా వ్యవహరించింది. ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాను,” అని విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక విద్యార్థి నిరసనకారుడు మాట్లాడుతూ, “నిన్న అనేక మంది విద్యార్థులు మరణించారు. ప్రధాన మంత్రి దేశాన్ని విడిచి వెళ్లాలి. విద్యార్థుల పోరాటం కొనసాగుతుంది” అని చెప్పారు.
ప్రభుత్వ రక్షణాత్మక వైఖరి
సోమవారం రాత్రి జాతికి ప్రసంగం చేసిన ప్రధాన మంత్రి ఓలి, గత వారం విధించిన సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, హింసకు “స్వార్థపూరిత గుంపులు” కారణమని ఆయన ఆరోపించారు. దర్యాప్తు కమిటీ, బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయం, గాయపడిన వారికి ఉచిత వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
కానీ నిరసనకారులు ఆయన రాజీనామా చేయకపోతే వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగా మారాయి.
