Nayanatara: లేడీ సూపర్స్టార్ నయనతారకు సంబంధించిన డాక్యుమెంటరీ వివాదంలో తాజా మలుపు చోటు చేసుకుంది. ‘చంద్రముఖి’ నిర్మాతలు నయనతారకు లీగల్ నోటీసులు ఇచ్చారంటూ నిన్నటి నుండి తెగ ప్రచారం జరుగుతోంది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీలో పర్మిషన్ లేకుండా ‘చంద్రముఖి’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను వాడారని, నయనతారతో పాటు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ను రూ.5 కోట్లు చెల్లించమని లీగల్ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వెలువడాయి.
శివాజీ ప్రొడక్షన్స్ క్లారిటీ
అయితే ఈ విషయంపై ‘చంద్రముఖి’ నిర్మాతలు, శివాజీ ప్రొడక్షన్స్ తాజాగా స్పందించారు. నయనతారకు తాము ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, డాక్యుమెంటరీలో ‘చంద్రముఖి’ సన్నివేశాలు తమ పర్మిషన్తోనే ఉపయోగించారని స్పష్టం చేశారు. మొత్తం 17 సెకన్ల సన్నివేశాలకు 2023 నవంబర్లోనే ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC)’ ఇచ్చామని తెలిపారు. ఈ క్లారిఫికేషన్తో చంద్రముఖి వివాదానికి చెక్ పడినట్లు కనిపిస్తోంది.
ధనుష్తో వివాదం
ఇదిలా ఉండగా, నయనతారకు సంబంధించిన మరో వివాదం తాజాగా పెద్ద చర్చనీయాంశమైంది. ఆమె డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన ‘నేనూ రౌడీనే’ చిత్రంలోని కొన్ని షూటింగ్ క్లిప్పింగ్స్ను వాడటం సమస్యగా మారింది. ఈ సన్నివేశాలను అనుమతి లేకుండా వాడారని ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, నయనతార మరియు నెట్ఫ్లిక్స్పై రూ.10 కోట్ల పరిహారం డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపారు.
నయనతార స్పందన
ఈ క్రమంలో ధనుష్ను లక్ష్యంగా చేసుకొని నయనతార ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ వివాదాన్ని చట్టపరంగా తేల్చుకుంటానని, తనపై చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టంచేశారు.

